------
online లో
కొనుగోలు చేయుటకు Devullu.Com
క్లిక్ చేయగలరు.
------
మీసాల గోపాలుడు!

చేతవెన్న ముద్ద పట్టిన చిన్నారి కన్నయ్య... గోపికా మానసచోరుడు... కంస-చాణూర మర్దనుడు... గీతాచార్యుడు... ఇలా అనేక పాత్రల్లో శ్రీకృష్ణుని రూపం అందరికీ పరిచితమే... అయితే వీటిలో ఏ రూపంలోనూ మీసం మనకు కనిపించదు... నాసాగ్రాన మౌక్తికాన్ని తప్ప ముక్కుకింద మీసాన్ని ఊహించుకోలేం... కానీ నల్లనయ్య మీసంతో కనిపించే ఆలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి.

శంఖ చక్రపాణి!
 

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పేరు వినగానే నోరూరించే పూతరేకులు గుర్తుకొస్తాయి. ఆ ప్రాంతం వారికి కృష్ణుడు అనగానే చటుక్కున గుర్తుకు వచ్చేది మీసాల కృష్ణయ్య. అఖండ గోదావరి రెండు పాయలై... వశిష్ఠ, గౌతమి నదులయ్యాయి. ఆ నదులను ఆనుకున్న ప్రధాన కాలువలూ, కనుచూపు మేర పచ్చని పంట పొలాలతో ప్రకృతి సోయగాల మధ్య అలరారే పల్లెటూరు పులిదిండి. గౌతమీ గోదావరి నది చెంతనే ఉన్న ఆ గ్రామం మధ్యలో మీసాల వేణుగోపాల స్వామి స్వయంభువుగా వెలిసిన ఆలయం ఉంది.

ఎక్కడుంది?: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పులిదిండిలో

ఎలా వెళ్ళాలి?: రాజమండ్రి నగరానికి సుమారు 27 కి.మీ. దూరంలో పులిదిండి ఉంది. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం రాజమండ్రిలో ఉంది.

ప్రత్యేకతలు: సుమారు 300 ఏళ్ళ కిందట వెలసిన పులిదిండి వేణుగోపాల స్వామి నల్లరాతి విగ్రహం విలక్షణంగా ఉంటుంది. కుడిచేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం ధరించి, మీసాలతో శోభాయమానంగా స్వామి దర్శనమిస్తారు. నిండు మనసుతో కొలిస్తే, కోరిన కోర్కెలను తీర్చే దైవంగా భక్తులు మీసాల వేణుగోపాలుణ్ణి ఆరాధిస్తారు. స్వామివారికి ఏటా కళ్యాణం, నిత్య ధూపదీప నైవేద్యాలూ జరుగుతున్నాయి. ఆయనకు మొక్కుకుంటే పెళ్ళిళ్ళు జరుగుతాయన్న నమ్మకం కూడా ఉంది. 1967లో విడుదలైన ‘సాక్షి’ సినిమా చిత్రీకరణ ఈ ఆలయంలో జరిగింది.

ప్రముఖ నటులు కృష్ణ, విజయనిర్మల మీద వివాహ దృశ్యాన్ని తీశారు. ‘‘ఈ స్వామి దగ్గర పెళ్ళి సీన్‌ నటించారు కాబట్టి మీకు నిజంగా వివాహం జరుగుతుంది!’’ అని హాస్య నటుడు రాజబాబు వారితో అన్నారట. ఆ తరువాత కృష్ణ, విజయనిర్మల దంపతులయ్యారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో విజయనిర్మల స్వయంగా చెప్పారు. ‘సాక్షి’తో పాటు బాపు దర్శకత్వంలో రూపొందిన ‘బుద్ధిమంతుడు’, ‘ముత్యాలముగ్గు’, ‘తూర్పు వెళ్ళే రైలు’ తదితర చిత్రాల షూటింగ్‌ ఈ ఆలయంలో జరిగింది.

ఆ మీసం ఆపద్ధర్మం!
 

తెలంగాణలోని చెల్లాపూర్‌ గ్రామంలో మీస మాధవుడు కొలువు తీరడం వెనుక ఆసక్తికరమైన కథనం ఒకటి ఉంది. 200 ఏళ్ళ కిందటి మాట. దుబ్బాక సంస్థానాన్ని పాలించే దొరల వల్ల వేధింపులకు గురైన ఆ గ్రామస్తులు కప్పం కట్టకూడదని నిర్ణయించుకున్నారు. నిలువు నామాలు కలిగిన వేణుగోపాలస్వామి ఆలయాన్ని కట్టి, ఆ పేరు చెప్పి కప్పానికి ఎగనామం పెట్టాలనుకున్నారు. ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. కాశీ నుంచి విగ్రహం తెప్పిద్దామనుకున్నారు. అయితే ఆర్థిక స్థోమత సరిపోలేదు. దీంతో నిరాదరణకు గురైన ఆలయం నుంచి విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠిద్దామన్న ఆలోచన చేశారు.

రాత్రి వేళల్లో ఎడ్ల బండ్ల మీద తిరుగుతూ విగ్రహాన్వేషణ చేశారు. రామ్‌గోపాల్‌పేట అనే గ్రామంలో అలాంటి విగ్రహం కనిపించింది. దాన్ని తెచ్చి, ప్రతిష్ఠించాలనుకుంటూండగా, రామ్‌గోపాల్‌పేట గ్రామస్తులు విగ్రహాన్ని వెతుకుతూ వస్తున్నారని తెలిసింది. దీంతో విగ్రహాన్ని చెరువులో దాచిపెట్టారు. తరువాత విగ్రహ ప్రతిష్ఠకు ఉపక్రమించారు. విగ్రహాన్ని రామ్‌గోపాల్‌పేట వారు గుర్తుపట్టకుండా... దాని తలపై ఉన్న కొప్పును తొలగించి కిరీటం పెట్టారు. విగ్రహానికి వెండి మీసాలను చేర్చారు. దీంతో మీసాల కృష్ణుడు ఆ ఆలయంలో కొలువుతీరి, అదే రూపంలో పూజలందుకుంటున్నాడు.

ఎక్కడుంది?: తెలంగాణ రాష్ట్రం మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్‌లో

ఎలా వెళ్ళాలి?: హైదరాబాద్‌కు 128 కి.మీ., మెదక్‌కు 55 కి.మీ. దూరంలో చెల్లాపూర్‌ ఉంది. ఆ ప్రాంతాలనుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

ప్రత్యేకతలు: ఈ ఆలయంలో అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. ఇది సుమారు 200 ఏళ్ళ నుంచి నిరంతరాయంగా వెలుగుతూనే ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. దీనివల్ల గ్రామం పాడిపంటలు, సిరిసంపదలతో తులతూగుతుందని వారి నమ్మకం. వ్యవసాయ పనులు మొదలు పెట్టగానే స్వామికి ముడుపులు కడతారు. అలాగే, ఎలాంటి వివాదమైనా వేణుగోపాలుని ఆలయం మెట్లు ఎక్కితే ఇట్టే పరిష్కారం అవుతుందనీ, స్వామి సన్నిధిలో అబద్ధం ఆడినవారికి తప్పదని స్థానికులు విశ్వసిస్తారు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment