భగవద్గీత మూలం | Bhagavad gita Slokas only |

భగవద్గీత మూలం 
 Bhagavad gita 
Slokas only
Rs 27/-
కర్మయోగం 


   తేనెపట్టు లోపలకు వెళుతూ, బయటకు వస్తూ ఎగురుతూ ఆనందంగా ఉన్న తేనెటీగలు, ఒకదాని వెంట ఒకటి బారులు తీరి వెళుతున్న చీమల వరసలు... ఈ దృశ్యాలను చూస్తే మనకు స్ఫురించేది ఒకటే. ఎప్పుడూ పనిలో ఉండాలి. ఖాళీగా అసలు ఉండకూడదు! పనిలో విశ్రాంతి పొందడం అలవాటుపడ్డాక ఖాళీ అన్న మాటకు నిఘంటువులో అర్థం దొరకదు.

ప్రకృతి మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. అందులో అత్యంత కీలకమైనది ‘కర్మ’. అంటే, పని. ఎవరి పని వాళ్లు శ్రద్ధగా సోమరితనం లేకుండా కర్తవ్యంగా భావించి చెయ్యాలని. దీనినే లోతుగా విశ్లేషించింది భగవద్గీత. కర్మయోగం అని పేరుపెట్టి చాలా రహస్యాలు విడమరచింది.

ఈ జ్ఞానం చీమలకు అక్కరలేదు. తేనెను అందించే తేనెటీగలకు అక్కరలేదు. మొక్కనుంచి వృక్షం వరకు స్థిరంగా నిలుచుని పచ్చదనం అందించే పర్యావరణ సారథైన చెట్టుకు అక్కరలేదు. చెట్టు ఏం పని చేస్తుంది? చెట్టుకు కర్మకు ఏమిటి సంబంధం అని అనుకోనవసరం లేదు. చెట్టులోనే కర్మ ఉంది. చెట్టే ఒక యోగం. అది మనిషి ప్రాణాన్ని నిలిపే యోగం.

జ్ఞానం ఎందుకు, మన పని మనం చేసుకుని వెళ్లిపోదాం అనుకునేవాళ్లు ఒక రకం. తోటలో ఆకులు లెక్కపెడుతూ కూర్చొని మధురమైన ఫలాలు తినకుండా విడిచిపెట్టేవాళ్లు మరోరకం. జ్ఞానం ఉన్నవాళ్లు, లేనివాళ్లు నిరంతరం కర్మ చెయ్యాలి. కర్మలో ఆనందం పొందాలి. పని చెయ్యకుండా ఉండటం ప్రకృతి విరుద్ధం.

ఎవరి అన్నం వాళ్లు తినడానికి పని చెయ్యాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనుకున్నవాళ్లు అందరి అన్నం కోసం పని చెయ్యాలి. పనిలో ఆనందరహస్యం తెలుసుకున్నవాళ్లు పనికి అంకితమైపోతారు. ఇంతటి అద్భుతమైన ప్రపంచాన్ని దృశ్యమానంగా అనుభవంలోకి తెచ్చేది వారే.

శ్రీకృష్ణుడు చెబితేనేగాని కర్మను యోగమార్గంలో చెయ్యాలని తెలియలేదు. ఆయనే పరమ ప్రమాణం. మహానుభావులు, అవతారమూర్తులు ఏది ఆచరిస్తారో అది అందరికీ శిరోధార్యం అవుతుంది. దాన్ని సామాన్యులు ఆచరిస్తారు. 
యోగమార్గంలో కర్మ అంటే మనకు తెలియదు. ప్రకృతికి తెలుసా? తెలియదు. దానితో సంబంధం లేకుండా దాని పని అది చేసుకుపోతుంది. మనిషి తప్ప అన్ని జీవులూ వాటి పనులు అవి చేసుకుపోతున్నాయి. మనిషిని మాత్రం ఒక సందేహం ప్రతి నిత్యం పీడిస్తోంది. ఈ పని నాదా కాదా అని. ఇక్కడే పుట్టింది కర్మయోగం. దీనికి కురుక్షేత్రంలో వివరణ ఇచ్చి విశ్వరూపం చూపించి- ‘నీ పని నువ్వు చెయ్యి. నా పని నేను చేస్తాను’ అని గీత గీసేశారు గీతాచార్యుల వారు. అర్జునుడికి మతిపోయింది. తెలివి వచ్చింది. వివేకం కలిగింది.

ప్రకృతిలో ఏ జీవికీ లేని ‘నేను’ నన్నెందుకు పట్టుకుంది అని ఆలోచించి, ఒక నిర్ణయానికి వచ్చి యుద్ధం చేశాడు పార్థుడు. విజయం సాధించాడు. అది అర్జునుడొక్కడి విజయం కాదు. అది మానవాళి విజయం. మనిషి అహంకారం, అజ్ఞానం మీద శ్రీకృష్ణుడు ప్రయోగించిన తిరుగులేని బాణం. మనిషికి ఈ జ్ఞానమే కావాలి. ఈ జ్ఞానమే అతడి జీవిత నౌక. ఈ జ్ఞానమే దిక్సూచి. ఈ జ్ఞానమే మనిషి అంతస్సీమలకు వెలుగు. ఈ జ్ఞానం కావాలి. ఇదే కర్మయోగ రహస్యాలను విడగొట్టిన దివ్యజ్ఞానం. దీన్ని మానవుడు ఒంటపట్టించుకోవాలి. విశ్వరూప సందర్శనం కలిగేదాకా ప్రతి మానవుడి తపస్సే ఈ జ్ఞానం. ఇదే భగవద్గీత.

కర్మయోగుల్లా పనిచేసే చీమలకు భగవద్గీత అక్కరలేదు. వాటికి ‘నేను’ లేదు. తేనెటీగలకు, సీతాకోకచిలుకలకు, పాములకు, పురుగులకు, పక్షులకు, చెట్లకు, నదులకు, సముద్రాలకు- ప్రత్యేకించి భగవద్గీత అక్కరలేదు. అవి కర్మయోగంలోనే ఉన్నాయి. ప్రకృతి మనకు గురువు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు- కాంతి సముద్రాలు. వాటి ప్రకాశమే జ్ఞానం. అక్కడ మనిషి పని చేసుకోవాలి. ఆ వెలుగులో ‘నేను’ మరిచిపోయి జీవనయాత్ర సాగించాలి. 
ఆడుతూ పాడుతూ తనను మరిచి పనిచేస్తుంటే మనిషిని చూసి చీమలు, తేనెటీగలనేముంది- మొత్తం ప్రకృతి పరవశించిపోతుంది. ఖాళీ సమయాలు లేవు, పనిలోనే నాకు విశ్రాంతి అని మనిషి ప్రకటించిన రోజున- దైవం ఉద్దేశం నెరవేరుతుంది. విశ్వప్రణాళిక బలపడుతుంది!
- ఆనందసాయి స్వామి
---------------------------------------------
జ్ఞాపకాలు 


    జీవితం పరస్పర ప్రభావాలను సూచిస్తుంది. మంచైనా, చెడైనా ఆ ప్రభావాల ఫలితాలు మనిషిపై కనిపిస్తాయి. ఎదురైన సమస్యను పరిష్కరించాలనుకుంటే దానికిగల కారణాన్ని విశ్లేషించుకుని వ్యవహరించాల్సింది ఆ వ్యక్తే.

ప్రతి కుటుంబంలోనూ మనుషుల్లో మంచివాళ్లు, చెడ్డవాళ్లు... ఎప్పుడూ ఉంటారు. మంచిచెడుల నిర్వచనాలు ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కో రకంగా ఉంటాయి. అవి వారి వారి ఆలోచనా వైఖరి, విలువల మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రక్తసంబంధీకుల మధ్యే తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్యే సఖ్యత కుదరడంలేదు. మంచీ చెడు పక్కపక్కనే కలిసుంటాయి. అదే జీవితమేమో! మనకు దూరంగా ఆకాశంలో ఎక్కడో ఉన్న గ్రహాల్లో కొన్నింటిని అశుభంగా, మరికొన్ని మంచివిగా పరిగణించడం చూస్తూనేఉన్నాం.

ఎవరు మంచి, ఎవరు చెడు అని చింతించడం, లోతుల్లోకి వెళ్లకుండా ఉండటం అన్నివిధాలా శ్రేయస్కరం. ఎవరికైనా గతించిపోయిన చర్యలు, ఫలితాలు అన్నీ కేవలం జ్ఞాపకాలే. చాలామంది ‘ఫలానావారు ఇలా చేశారు... ఇలా ప్రవర్తించారు’ అని అంటుంటారు. భూమిపై, నీటిపై, ఆకాశంపై వాటి తాలూకు ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా? ఆ సంఘటనలు, సందర్భాలు అన్నీ జ్ఞాపకాలే. జ్ఞాపకాలే మనిషిని బాధపెడతాయని, మనుషులు కాదని గుర్తుంచుకుని మసలుకుంటే మనసులో ఎవరిపైనా ద్వేషం ఉండదు. ద్వేషం లేనప్పుడు ఆలోచనలు సక్రమంగా ఉంటాయి.

జ్ఞాపకాలు మనిషిని నీడలా వెంటాడి బాధిస్తాయి. సంతోషపెడతాయి కూడా. సంతోషపెట్టినప్పుడు ఏ సమస్యా ఉండదు. 
మహాభారతంలో యుధిష్ఠిరుడు ‘యుద్ధంలో నేను విజయం సాధించానంటున్నారు. కానీ, నేను ఓడిపోయాను. మనశ్శాంతి కోల్పోయాను. చాలా బాధపడుతున్నాను. రాజ్యం సాధించి ఏమిటి లాభం? నేను మళ్ళీ అడవికి వెళ్లి పండ్లు, కందమూలాలు తింటూ తపస్సు చేసుకుంటాను. ఇంతకు ముందు జూదంలో ఓడి అడవికి వెళ్లాను. ఇప్పుడు నా శత్రువులను జయించి వెడుతున్నాను...’ అంటాడు.

అతడిని ఎవరూ ఓదార్చలేక అంపశయ్య మీదున్న భీష్మపితామహుడి దగ్గరకు తీసుకెళ్తారు. ‘మనవడా... అంతా జరిగిపోయింది. ఎవరూ మరోలా మార్చలేరు. ఒక సంఘటన, ఒక చర్య జరిగిపోయిందంటే అది చరిత్ర. నువ్వు బాధపడుతున్నది ఆ స్మృతుల వల్ల మాత్రమే. గతంలోని చర్యలు జ్ఞాపకాలై నిన్ను బాధిస్తున్నాయి. సత్యం చెబుతా విను- ఇప్పుడు తీసుకునే చర్య కూడా గతమవుతుంది. కొత్త జ్ఞాపకం, పాత జ్ఞాపకాన్ని మరుగునపడేయడం సహజం. తెలివిగా వ్యవహరిస్తే కొత్త జ్ఞాపకం ఉపశమనాన్నిస్తుంది. స్వేచ్ఛను ప్రసాదించి, ముక్తికి మార్గం చూపుతుంది’ అని ఊరడిస్తాడు గంగా తనయుడు.

‘నిన్న’ ఈరోజు జ్ఞాపకం... ‘రేపు’ నేటి కల- అంటారు ఖలీల్‌ జిబ్రాన్‌. ఎదుటివారిని, పరిస్థితుల్ని చాలా సమయం అంచనా వేస్తుండటం వల్ల మనకే హాని కలుగుతుంటుంది. ఎవరినీ మాటలతో, చర్యలతో బాధించకుండా ఉన్నప్పుడు మనకు మనశ్శాంతి దక్కుతుంది.

యథార్థాన్ని చూడకుండా ఉండాలని కళ్లు మూసుకోవచ్చునేమోగాని, జ్ఞాపకాలు కనిపించకుండా ఉండవు. జీవితం నవ్వుల్ని, కన్నీటిబొట్లను, జ్ఞాపకాలను మోసుకొస్తుంది. కన్నీటి బొట్లు ఆరిపోతాయి. నవ్వులు మాసిపోతాయి. ఎప్పటికీ నిలిచిఉండేవి జ్ఞాపకాలే. మంచిరోజులు మంచి జ్ఞాపకాలను మిగులుస్తాయి. చెడ్డరోజుల్ని మంచి పాఠాలుగా మనిషి భావించినప్పుడు ఎటువంటి సమస్యా ఉండదు.

జీవితంలో కష్టాలు అనుభవించి ఒక స్థాయికి వచ్చినవాళ్లు- ‘నా జ్ఞాపకాలే నా శత్రువులు’ అనడం వింటుంటాం. 
కాలం వెళ్లిపోతుంది, జ్ఞాపకాలు మరుగున పడుతుంటాయి. భావాలు మారిపోతుంటాయి. మనుషులు వెళ్లిపోతుంటారు. కానీ- హృదయాలకు మరపు ఉండదు. మధురమైన జ్ఞాపకాలు కొన్ని మనిషి జీవితకాలాన్ని పొడిగిస్తే, కొన్ని వెంటాడే జ్ఞాపకాలు మానసికంగా కోలుకోలేని విధంగా మార్చేస్తాయి. - మంత్రవాది మహేశ్వర్‌
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment