దేవరచర్ల శివుడిని చూసారా ?
ఆకుపచ్చని ప్రకృతి అందాలు .... చుట్టూ కొండలు.. దుర్భేద్యమైన అడవులు . కొండల నడుమ జాలువారే జలపాతం..! శివలింగాన్ని నిత్యం అభిషేకించే జలధారలు..! ఇది బాహుబలి చిత్రంలో రాజమౌళి సృష్టించిన గ్రాఫిక్ ప్రపంచం కాదు..! రాజమౌళి ఇక్కడి దృశ్యాలను చూసి పరవశించి బాహుబలి లో పెట్టాడా అనిపిస్తుంది.
మనసు పరవశించి .... తన్మయత్వానికి లోను చేసే ఈ అద్భుతం దేవరచర్లలొ ఉంది..! లింగమయ్య-గంగాదేవీ అపూరూప సంగమమైన ఈ అద్భుత ప్రదేశం దేవరచర్ల. జటాఝూటంలో గంగను బంధించిన లింగమయ్య… పాల వెన్నెల జలధారల్లో జలకమాడే అద్భుతం..! పరవళ్లు తొక్కుతూ కొండలు, కోనల నడుమ ఉరకలెత్తిన ఆకాశగంగ… పరమశివుడ్ని అభిషేకించే అపురూప దృశ్యం..! ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం.
దేవరచర్ల నల్లగొండ జిల్లా చందంపేట మండలం లో ఉంది . దీన్నే తెలంగాణా అరకు అంటారు . ఇక్కడి ప్రకృతి సోయగాలు మనల్ని మరో లోకంలోకి తీసుకెళుతాయి… దేవరకొండ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుగ్రామం దేవరచర్ల. ఇక్కడ్నుంచి 5కిలోమీటర్ల నడక ద్వారా మునిస్వామిగుట్టకు చేరుకోవచ్చు.మునిస్వామి గుట్టలో కొండల పై నుంచి జలపాతం జాలువారే చోటే శివలింగం కొలువై ఉంది. ఇదే ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ వందల ఏళ్ల నాటి పురాతన ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం పక్కనే ఓ సొరంగ మార్గం కూడా ఉంది. అయితే ఈ నిర్మాణాలు ఎప్పటివో ఎవరికీ తెలియదు. ఇక్కడ ఉండే గిరిజనులు మాత్రం తమ తాత ముత్తాతల కాలం నుంచి ఈ శివాలయం, జలపాతం ఉన్నాయని చెబుతున్నారు. దేవరచర్ల గ్రామానికి చెందిన కేతావత్ గోపా..70 ఏళ్ల క్రితం పశువులను మేపుతున్న క్రమంలో ఈ శివలింగాన్ని చూశారు. నాటినుంచి ఆ ప్రాంత గిరిజనులే ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు.ప్రతి ఏటా శివరాత్రి, ఏకాదశి పర్వదినాల్లో మునిస్వామి గుట్టల్లో ఇక్కడి గిరిజనులు గోపా బావోజీ పూజలు నిర్వహిస్తారు. ఈ జాతరకు గుట్ట పైకి వందల సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తారు. మిగతా సందర్భాల్లో మునిస్వామి గుట్టలకు ఎవరూ రారు. నిర్మానుష్యంగా ఉంటుంది. ఈ ఆలయానికి అపవిత్రంగా వెళ్తే భక్తులకు అక్కడి కందిరీగలు, గబ్బిలాలు హాని చేస్తాయని ఇక్కడి గిరిజనులు చెబుతారు.
దేవరకొండ ఖిల్లా ను 13వ శతాబ్దంలో రేచర్ల పద్మనాయక వంశానికి చెందిన రాజులు పాలించారు. ఇక్కడి శివాలయంలో చెక్కిన పద్మాలను బట్టి ఈ నిర్మాణాలు పద్మనాయక కాలం నాటివని తెలుస్తోంది. అయితే, కాలక్రమేణా ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. చెట్లు విరిగిపడటంతో ఆలయం కొంతమేర కూలిపోయింది.శివలింగాన్ని జలధారలు అభిషేకించే దృశ్యం ఎంతో రమణీయంగా ఉంటుంది. గుట్టల నుంచి జాలువారుతున్న నీటి పరవళ్లు ఎప్పుడూ లింగాన్ని అభిషేకిస్తూనే ఉంటాయి. మునిస్వామిఆలయాన్ని గుట్ట కింది భాగంలో నిర్మించారు. ముందు స్తంభాలను మాత్రమే నిలబెట్టి వెనుక భాగంలో కొండనే తొలిచి ఆలయంగా మలిచారు. నిర్మాణంలో వాడిన చతురస్రాకార ఇటుకలు కేవలం 200 నుంచి 300 గ్రాముల బరువు మాత్రమే ఉండటం ఆశ్చర్యకరం.మునిస్వామి గుట్టల్లో శిథిలావస్థకు చేరిన మరొక ఆలయ ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఇక్కడశివలింగం చుట్టూ చిన్నసైజులో మరో 18 లింగాకారాలున్నాయి. ఆలయం పక్కనే ఒక గుహ లాంటి నిర్మాణం ఉంది. ఇక్కడి నుంచి శ్రీశైలం వరకు సొరంగ మార్గం ఉందని స్థానికులు చెబుతుంటారు. హైదరాబాద్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకొండకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ అందాలు కనువిందు చేస్తాయి. కృష్ణా పరివాహక ప్రాంతం తీరమంతా గుట్టలపై ఎన్నో గిరిజన తండాలు కనిపిస్తాయి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిస్తే తెలంగాణ టూరిజం మరింత పెరుగుతుంది. రోడ్డు మార్గం , ఇతర సదుపాయాలు ఏర్పాటు చేస్తే ఈ ప్రకృతి అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తారు .
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
|
No comments:
Post a Comment