ఓటు.. పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ప్రపంచ స్థితి, గతులను మార్చే శక్తి ఓటుకు ఉన్నది. ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం. కానీ చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సమాజం పురోగతి సాధించాలి, మనం బాగుపడాలి అనే తాపత్రయం ఉండడమే కాదు ఓటూ ముఖ్యమే. అందుకే భారత ప్రజాస్వామ్య పరిరక్షణకోసం మా వంతు కర్తవ్యాన్ని గుర్తించి ఉన్నతమైన నాయకున్ని ఎన్నుకుంటానని మేం ప్రతిజ్ఞ చేస్తున్నాం. మరి మీరు? 
- దాయి శ్రీశైలం, 

125కోట్ల జనాభా ఉన్న ఇండియాలో 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 50 కోట్ల మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం ఓటుహక్కు అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ కిందికి వస్తుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 62 ప్రకారం ఓటర్ల జాబితాలో పేరున్న ఓటర్లందరూ ఓటు వేయడానికి అర్హులే. ఇంత స్పష్టంగా రాజ్యాంగమే చెప్తున్నా చాలామంది ఓటు వేయడానికి ఎందుకు ఆసక్తి కనబర్చడం లేదు? ఓటు హక్కు అనేది రాజ్యాంగపరంగా పౌరుడికి ప్రసాదించిన కీలకమైన హక్కు అనీ, ప్రజాస్వామ్యానికి ఇది చాలా మౌలికమైన ఆధారమని సాక్షాత్తు సుప్రీంకోర్టే 2013లో స్పష్టం చేసింది.




ఓటు ఎందుకు వేయాలి?A Vote Is Like a Rifle. its Usefulness Depends Upon The Character Of The Users. 
ఓటు రైఫిల్ లాంటిది. దాని ఉపయోగం ఓటేసే వారిని బట్టి ఉంటుంది అంటున్నారు థియోడార్ రూజ్‌వెల్ట్. ఓటు ఎంత విలువైందో దీన్నిబట్టి తెలుసుకోవచ్చు. మీరు వేసిన ఓటు దుర్వినియోగం కావద్దు అంటే దీనిని పాటించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధిని కోరుకునేవారికే ఓటు వేయాలనేది దీనర్థం. సెంటిమెంట్ ప్రకారమో, సింపథీ ప్రకారమో ఓటు వేస్తే ప్రజా ప్రతినిధి ఎంపికలో మీరు తప్పటడుగు వేసినట్లే. ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఈ రకమైన అవగాహన కలిగించేందుకు తెలంగాణ వ్యాప్తంగా విస్త్రృత ప్రచారం జరిగింది. నేను ఓటు నమోదు చేసుకున్నాను. మరి మీరు? టీవీ, రేడియో, సోషల్‌మీడియాలో ఇవే ప్రకటనలు వినిపించాయి. 

రాజ్యాంగం కల్పించిన హక్కు!The one sure way of participating in the process of nation-building is to vote on the election day. 
ఓటు వేయడమంటే జాతీయతా భావం పెంపొందించడమే అన్నారు మోహిత్ చౌహాన్. అతని దృష్టిలో ఓటు వేయడం అంటే ఏదో ఎన్నికల తంతు మాత్రమే కాదు. ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఆ ఒక్క రోజు జరిగే హడావిడి అంతకన్నా కాదు. ఓట్ల ప్రక్రియ ఒక యజ్ఞం లాంటిది. దాన్ని రాజకీయాంశంగా మాత్రమే భ్రమపడితే పొరపాటే. జాతీయతా భావాన్ని పెంపొందించే సాధనం ఓటు. సమర్థవంతమైన ప్రజా ప్రతినిధిని ఎన్నుకొని సాంఘీక, ఆర్థిక, సమానత్వం సాధించడానికి పౌరులంతా ఓటు వేయాల్సిందిగా భారత రాజ్యాంగం సూచిస్తున్నది. రాజకీయ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం అవుతూ పాలనలో ప్రత్యక్ష పాత్ర పోషించడానికి, రాజ్యాంగ వ్యవస్థను నిలబెట్టేందుకు దేశ పౌరులు ఓటు వేసి రాజ్యాంగ హక్కును పరిరక్షించుకోవాలి. 

ఓటు ఎవరు వేయాలి?The vote is the most powerful instrument ever devised by man for breaking down injustice and destroying the terrible walls which imprison men. they are different from other men. 
అన్యాయాన్ని ఎదురించడానికి మనిషి చేత సృష్టించబడిన అత్యంత శక్తివంతమైన వాయిద్యం ఓటు అని పేర్కొన్నారు లిండన్ బి జాన్సన్. ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును పౌరులంతా వినియోగించుకోవాలి. ఓటు వేయడానికి కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష, ఆర్థిక బేధాలు ఉండవు. 18 సంవత్సరాలు నిండిన భారత పౌరులంతా ఓటుకు హక్కు పొందే, వినియోగించుకునే అవకాశం భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 కల్పించింది. దేశ పౌరులుగా ఉన్నవారంతా ఓటు హక్కును వినియోగించుకుంటే సమర్థవంతమైన నాయకత్వాన్ని గెలిపించుకునే అవకాశం ఉంది.




ఓటు విలువెంత?To vote is like the payment of a debt, a duty never to be neglected, if its performance is possible. 
ఓటు చెల్లింపు వంటిది. అది పనిచేయడం సాధ్యమైతే ఓటు పొందిన వారిలో నిర్లక్ష్యం కనిపించదు అంటున్నారు రూథర్‌ఫర్డ్ బి హేయ్స్. చెల్లింపు అంటే ఓటుకు నోటు చెల్లింపు అని కాదు. మనం మన భవిష్యత్‌ను ఓటు రూపంలో చెల్లిస్తున్నాం అన్నమాట. ఆ చెల్లింపే రేపటి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసేలా ఉండాలనేది రాజ్యాంగం ఉద్దేశం. ఏవో చిన్నపాటి నజరానాల కోసం కాకుండా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, జన బాహుళ్యానికి అవసరమయ్యే శాశ్వత ప్రయోజనాల గురించి ఆలోచించి ఓటు వేయాలి. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఓటు విలువను తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించారు. సెప్టెంబర్ 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో, బూత్‌లెవల్‌లో ఓట్ల సవరణ, నమోదు ప్రక్రియ పూర్తి చేశారు.




ఓటుతో మార్పు సాధ్యమేనా?The vote is precious. Its almost sacred, so go out and vote like you never voted before.
ఓటు విలువైనది. పవిత్రమైంది కూడా. కాబట్టి వెళ్లి ఓటు వెయ్యి. ఇంతకముందులా కాకుండా ఇప్పుడు నిజాయితీకే ఓటు వెయ్యి అని చెప్పారు జాన్ లూయీస్. అంటే ఓటు వ్యవస్థలో మార్పుకు నాంది పలుకాలి. పురోగతి సాధించడానికి ఆయుధం అవ్వాలి. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో నాయకుల్లో నైతికత ఉండేది. విలువలు ఉండేవి. కానీ ఇవన్నీ రానురాను తగ్గిపోయాయి. ఇది ఆందోళన కలిగించే విషయం అయితే దీనికన్నా ఎక్కువ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే మంచి నాయకులను ఎన్నుకోవాల్సిన వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఓటు వేస్తే మనకేంటి? అనే నెగెటివ్ ధోరణితో ఉంటున్నారు. ఓటు వేస్తే మన జీవితాలు ఎలా ప్రభావితం అవుతాయో? మనం చెల్లించే డబ్బులు తిరిగి మనపై ఎలా ఖర్చు చేస్తారో? అనే విషయాలు నేటికీ 90% ప్రజలు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదనేది నిజం. కాబట్టి అక్కడే ఆగిపోయి మార్పు రావడం లేదు అనే బదులు బాధ్యతగా ఓటేసి.. బాజాప్తా నిలదీస్తే మార్పు దానంతట అదే వస్తుంది.




నోటా కూడా ఉంది!The vote is the most powerful nonviolent tool we have. 
ఓటు అనేది అత్యంత శక్తివంతమైన అహింసా సాధనం అంటారు జాన్ లేవిస్. కాబట్టి మనం వేసే ఓటు ద్వారా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమాజానికి మేలు జరుగాలి. అలా ఉన్నవారికే ఓటు వేయాలి. అలా కాకుండా సమాజానికి హాని తలపెట్టే వారికిగానీ, అభివృద్ధి చేయలేరు అని భావించేవారికి గానీ ఓటు వేస్తే దాని ఫలితం శూన్యం. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియలో పాల్గొని ఎవరికీ ఓటు వేయడానికి మనసు ఒప్పుకోకపోతే నోటాకు ఓటు వేసే అవకాశమూ ఉంది. నోటా ద్వారా సాధించేది పెద్దగా ఉండకపోయినా ఇరువురి పట్లా అసంతృప్తి వ్యక్తం చేసేందుకు ఈ ఆప్షన్ పనికొస్తుంది. ఇది మనకు రాజ్యాంగం కల్పించిన ఆఖరి హక్కు. నోటు కోసం ఓటుని అమ్ముకుంటూ మీ జీవితాలని మీరే నాశనం చేసుకోవడం కాకుండా, ఓటుకు నోటును ప్రోత్సహించకుండా ఉండేందుకు నోటా చివరి అవకాశం.




ఎవరి కోసం ఓటేయాలి?We must vote for hope, vote for life, vote for a brighter future for all of our loved ones
మన ఆశ కోసం, జీవితం కోసం, మనవాళ్ల కోసం, ఒక ప్రకాశవంతమైన భవిష్యత్ కోసం మనం ఓటు వేయాలి అంటారు ఎడ్ మార్కే. ఆయన చెప్పేదేంటంటే ఓటు హక్కు ఉన్న ప్రతీ పౌరుడు ఎన్నికల్లో ఓటు వేసి తనకు నచ్చిన అభ్యర్థిని గెలిపించుకోవాలి. తద్వారా ప్రభుత్వ నిర్మాణంలో పాలుపంచుకోవచ్చు. ప్రభుత్వ నిర్మాణంలో పాలు పంచుకోవడం అంటే మన కోసం మనం ఓటేస్తున్నామన్నట్టేగా? పౌరుల కనీస అవసరాలు తీరాలంటే, మౌలిక సదుపాయాలు సమకూరాలంటే వ్యక్తిగతంగా కాకుండా వ్యవస్థగా కృషి చేయాల్సి ఉంటుంది. అంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఏర్పాటయ్యే ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉండాలో నిర్ణయించుకునే అధికారం, అవకాశం ఓటు హక్కు ఉన్న ప్రతీ పౌరుడికి ఉంటుంది కాబట్టి దాన్ని సాఫల్యం చేసుకునేందుకు కచ్చితంగా ఓటేయాల్సిందేనని అర్థం చేసుకోవచ్చు. 

ఎవరికి ఓటేయాలి?Vote for the man who promises least; hell be the least disappointing. 
కనీస వాగ్దానం చేసేవారికి ఓటు వేయండి. కనీసం అతనికి నిరాశైనా మిగులుతుంది అని చెప్తున్నారు బెర్నాండ్ బార్చ్. అంటే సాధ్యంకాని, అమలుకాని పనులు చేస్తామని ఉచిత హామీలు ఇచ్చేవారికి కాకుండా సాధ్యమయ్యే, సాధ్యం చేసి చూపెట్టే వారికి ఓటేయడం మంచిది. కనీస వాగ్దానం చేసి కూడా దాన్ని నెరవేర్చకపోతే.. హామీ ఇచ్చింది చెయ్యలేదనే కనీస నిరాశ అతడిలో ఉంటుంది. ఏదో వేయాలి కాబట్టి, పదే పదే అడిగారు కాబట్టి ఓటేస్తున్నాం అని కాకుండా నిక్కచ్చిగా, నిజాయితీగా ఉండేవారికి, వీరైతే అంతో ఇంతో చేస్తారు అనే నమ్మకం ఉన్నవారికి ఓటు వేస్తేనే కనీస ప్రజావసరాలు తీర్చే అవకాశం ఉంటుంది. ఓటు వేసిన ఫలాలు పొందే అవకాశమూ ఉంటుంది. ఇలా నిజాయితీగా ఉంటూ, ఇచ్చిన మాట నిలబెట్టుకునేవారికే ఓటు వెయ్యాలని నిర్ణయించుకాకపోతే ఓటు వేసినా ప్రయోజనం ఉండదు.




హక్కుల కోసం ఓటు హక్కు!The right to vote is the easiest of all rights to grant.
ఓటు హక్కు అన్ని హక్కులను మంజూరు చేయడాన్ని సులభతరం చేస్తుంది అని చెప్తున్నారు రాబర్ట్ కెన్నడీ. అంటే నమ్మకానికి, అమ్మకానికి మధ్య ఉన్న మన ఓటుని అమ్ముకోవడం కాకుండా మనం పొందాల్సిన హక్కులను సాధించుకునేందుకు ఓటు వేయాలనేది కెన్నడీ అభిప్రాయం. ఓటుహక్కు వజ్రాయుధంలాంటిది కాబట్టి ఆ ఆయుధం ద్వారానే హక్కులు సాధించుకోవచ్చు. నీచ రాజకీయాలు చేసేవాళ్లకు బుద్ధి చెప్పగలం. మనం లేనిది, మన ఓటు లేనిది నాయకులు ఎలా మనుగడ సాధిస్తున్నారు? తమ హక్కులు కానివి కూడా నాయకులు పొందుతున్నారంటే మరి మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందే అవకాశం ఉందా? లేదా? అని ఆలోచించాలి. మనం వేసేది ఒకే ఒక్క ఓటైనా అదే ఓటు గెలుపోటముల నిర్ధారణలో కీలకంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలాంటి ఓటు హక్కును వినియోగించుకొని మిగతా హక్కులు పొందాలి.




ఓటు వేయకపోతే?If you dont vote, you dont count. 
ఓటు వేయకపోతే మీరు లెక్కలో లేనట్లే లెక్క అంటారు నాన్సీ పెలోసీ. జన సామాన్యంలో కూడా ఈ అభిప్రాయం బలంగా ఉంది. అన్నీ తెలిసినవాళ్లు, విద్యావంతులు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉంది. దీనిని ప్రజాస్వామ్య సంస్కారంగా పేర్కొంటారు. ప్రజాస్వామ్య వర్థిల్లాలంటే ప్రతి పౌరుడు తన అంతరంగంలో ప్రజాస్వామిక సంస్కారాన్ని అలవరుచుకోవలసి ఉంటుంది. ప్రజాస్వామ్య సంస్కారం బయట ఎక్కడి నుంచో వచ్చింది కాదు. మనలో నుంచే వచ్చింది అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే పౌరులు తమ బాధ్యత గురించి తెలుసుకోవాలి. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా మంచి నాయకత్వం, సమాజ అభివృద్ధి కావాలని ఆశించడంలో అర్థం లేదు. కాబట్టి లెక్కలో లేనట్లుగా కాకుండా లెక్క మనిషి లెక్క మీ అమూల్యమైన ఓటును అభివృద్ధిని ప్రోత్సహించేవారికి వేయండి. 

ఎన్నారై ఓటు!A man without a vote is man without protection. 
ఓటు వేయని వ్యక్తి తనంతట తానే రక్షణ కోల్పోతున్నట్లు లెక్క అన్నారు సుసాన్ బీ ఆంటోనీ. మనం వేరే చోట ఉండొచ్చు. ఒకానొక సందర్భంలో వేరే దేశంలో ఉండొచ్చు. అక్కడ ఉంటూ భారత పౌరసత్వం కొనసాగిస్తున్నవారు కూడా తమ దేశంలో, రాష్ట్రంలో ఓటు వేస్తూ ఉనికిని చాటుకోవాలి. దీనికంటూ ప్రత్యేకంగా ఒక అవకాశమూ ఉంది. కానీ ఎంతమంది దీనిని వినియోగించుకుంటున్నారు? ఎన్నారైలకు భారత ఎన్నికల కమిషన్ ఓటు హక్కు కల్పించింది. కానీ లక్షలాది మంది విదేశాల్లో ఉంటున్న కారణంగానే స్వదేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంఖ్య సింగిల్ నెంబర్ డిజిట్లోనే ఉంది. రాష్ట్రంలో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇందులో విదేశాల్లో ఉండి, ఓటర్లుగా నమోదైనవారు కేవలం నలుగురే ఉన్నారు. ఇందులో ముగ్గురు పురుషులు, ఒక మహిళ. 2010లో ప్రజా ప్రాతినిధ్య సవరణ చట్టం సెక్షన్ 20-ఎ ప్రకారం 18 సంవత్సరాలు నిండి విదేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలు భారతదేశంలో ఓవర్సీస్ ఎలక్టర్స్ గా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment