మొబైల్లో సిమ్ అక్కర్లేదు
వింగ్స్ యాప్ ద్వారా వాయిస్ సేవలు
దేశంలోనే తొలిసారి
ఆవిష్కరించిన బీఎస్ఎన్ఎల్
2018 ఈనెల - 25న శ్రీకారం
ఏడాదికి రూ.1,099 రుసుం
ఏ నెట్వర్క్ ఇంటర్నెట్/ వైఫై అయినా ఫరవాలేదు
దిల్లీ: ఇంటర్నెట్ టెలిఫోనీ సేవలకు ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం మొబైల్ యాప్ ‘వింగ్స్’ను సంస్థ ఆవిష్కరించింది. ఈ యాప్ ద్వారా, దేశంలో ఏ టెలిఫోన్ నెంబరుకు అయినా కాల్ చేసుకోవచ్చు. ఏడాది రుసుముగా రూ.1,099 చెల్లించాలి. అనంతరం ఏ నెట్వర్క్ ఇంటర్నెట్ కనెక్షన్/వైఫై ద్వారా అయినా, దేశంలోని టెలిఫోన్ నెంబర్లకు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఈనెల 25న ఈ సేవలు ప్రారంభమవుతాయి.
‘ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉన్నా, బీఎస్ఎన్ఎల్ మార్కెట్ వాటా గౌరవప్రదంగానే ఉంది. ఇప్పుడు సిమ్ కార్డ్ అవసరం లేకుండా ఏదైనా నెట్వర్క్ ఇంటర్నెట్ లేదా వైఫై ఉన్నా, కాల్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన బీఎస్ఎన్ఎల్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నా’ అని టెలికాం మంత్రి మనోజ్ సిన్హా పేర్కొన్నారు. ఈ సేవలను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.
ఇదీ ప్రత్యేకత
ఇప్పుడు కూడా వాట్సాప్, వైబర్, స్కైప్, హ్యాంగవుట్స్, గూగుల్ డుయో, ఫేస్బుక్ మెసెంజర్ వంటి మొబైల్ యాప్ల ద్వారా వాయిస్ కాల్స్ చేసుకునే వీలుంది. అయితే రెండు మొబైల్ఫోన్లలోనే ఒకే యాప్ మధ్య మాత్రమే ఈ కాల్స్ వెళ్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ వింగ్స్ ద్వారా దేశంలోని, ఏ నెంబరుకు అయినా కాల్ చేసుకోవడమే ప్రత్యేకత.
పేరు నమోదు చేసుకోవాలి
ఈ యాప్ వినియోగానికి వివరాల నమోదును రెండు రోజుల్లో ప్రారంభిస్తామని బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. సేవలు ఈనెల 25న ప్రారంభమవుతాయని వెల్లడించారు. దేశీయంగా ఏ నెంబరుకు అయినా కాల్ చేసుకోవచ్చని, విదేశాల్లో పర్యటిస్తున్నపుడు కూడా, అక్కడ నుంచి ఇక్కడి నెంబర్లకు కాల్ చేసుకోవచ్చన్నారు. ఇంటర్నెట్/వైఫై సదుపాయం ఉంటే సరిపోతుందని తెలిపారు. ఈ యాప్ బీఎస్ఎన్ఎల్ మొబైల్ నెంబరుకు అనుసంధానమై ఉంటుంది. వింగ్స్ యాప్ వినియోగించాలనుకునే వారు, బీఎస్ఎన్ఎల్ మొబైల్ లేదా ల్యాండ్లైన్ నెంబరు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ ఫోన్ వినియోగిస్తున్న వారు, ఈ యాప్ తమ మొబైల్లో నిక్షిప్తం చేసుకుంటే, వారు ఎక్కడ ఉన్నా, ఆ ల్యాండ్లైన్కు వచ్చే కాల్స్ అందుకోగలుగుతారు. నెట్ అందరికీ సమానమే
నెట్ తటస్థత నిబంధనలకు టెలికాం కమిషన్ అంగీకారం
దిల్లీ: ఇంటర్నెట్ సేవలు అందరికీ సమానంగా అందేలా, నెట్ తటస్థత నిబంధనలను టెలికాం కమిషన్ ఆమోదించింది. ఈ ప్రకారం.. ఏదైనా విషయం (కంటెంట్), సేవల విషయంలో నెట్వర్క్ సంస్థలు పక్షపాతం చూపడం.. కొన్నిటిని నిరోధించడం, మరికొన్నింటికి అధికవేగం సేవలు అందించడం కుదరదు. అయితే నెట్ సాయంతో మారుమూల ప్రాంతాల్లో శస్త్రచికిత్సలు, స్వీయచోదక కార్లు వంటివి ఈ నిబంధనల పరిధిలోకి రావు. కొత్త టెలికాం విధానమైన నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ 2018ని కూడా కమిషన్ ఆమోదించి, కేంద్ర మంత్రివర్గ ఆమోదానికి పంపింది.
ఐడియా వొడాఫోన్ విలీనంతో టెలికాం రంగంలో స్థిరత్వం: ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియా విలీనం తరవాత టెలికాం రంగంలో స్థిరత్వం ఏర్పడుతుందని టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్ పేర్కొన్నారు. కొన్ని లాంఛనాలు పూర్తవ్వగానే, ఇరు సంస్థల విలీనం అమల్లోకి వస్తుందన్నారు. వొడాఫోన్ ఇండియా మాతృసంస్థ, బ్రిటన్ టెలికాం దిగ్గజం వొడాఫోన్ కాబోయే సీఈఓ, పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిక్ రెడ్, టెలికాం మంత్రి మనోజ్ సిన్హాతో పాటు టెలికాం కార్యదర్శిని కలిశారు. విలీనానికి ఆమోదం లభించడంపై తమ సంతోషాన్ని వెలిబుచ్చారు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
|
No comments:
Post a Comment