ఆయుర్వేద సిద్ధాంతాలు

ఆయుర్వేదం కేవలం వైద్యశాస్త్రం మాత్రమే కాదు... ఒక సమగ్ర జీవనశైలి. మిగతా వైద్య ప్రక్రియలు చాలావరకు చికిత్సలను మాత్రమే పేర్కొంటాయి. కానీ... సమగ్ర జీవన విధానం ఎలా ఉండాలో చెబుతూ... తద్వారా వ్యాధుల నివారణకూ ప్రాధాన్యమిస్తుందీ శాస్త్రం. ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తూనే దైనందిన వ్యవహారాలనూ, ఆహార విహారాలనూ, పథ్యాపథ్యాలనూ వాటి ప్రయోజనాలనూ విడమరచి వివరిస్తుందీ వేదం.

ఆచరిస్తే కడవరకూ ఉక్కుపిండంలా ఉండేలా చూస్తుంది.

ఆయుర్వేదం... అంటే?
ఆయుర్వేదం కేవలం ‘వైద్యగ్రంథం’ మాత్రమే కాదు. అందులో వైద్యం కూడా ఒక ప్రధాన అంతర్భాగం. ‘‘వేదం’’ అంటే జ్ఞానమని అర్థం. దీనినే శాస్త్రం అని కూడా చెప్పవచ్చు. ఆయువు అంటే జీవితం. ఆ విధంగా అది జీవితానికి సంబంధించిన ఒక సమగ్ర శాస్త్రం.

ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రాదుర్భవించిందే ‘‘ఆయుర్వేదం’’. కనుకనే ఆయుర్వేదం ఒక సమగ్ర జీవనవేదం. మనిషి మనుగడకు ఆధారమైన దినచర్య, ఋతుచర్య, స్వస్థవృత్తం, సద్వృత్తం వంటి వివరాలను సూచిస్తూ, జీవనశైలికి దిశానిర్దేశం చేసే సజీవనాదం. ఆహార విహారాల స్వరూప స్వభావాల్ని, ఆరోగ్యంలోనూ, ఆయుఃవృద్ధిలోనూ వాటికున్న ప్రాశస్త్యాన్ని శాస్త్రీయ దృక్కోణంలో చూపే నిలువుటద్దం. ఇది అధర్వణ వేదానికి ఉపవేదం.

ఆయుర్వేదంలో అసలు సూత్రం
‘‘మిథ్యాహార విహారాభ్యాం సర్వేషామేవరోగాణాం, మూలకారణం’’ 
శాస్త్రోక్తమైన ఆహార, విహారాలను ఉల్లంఘించడమే సమస్త రోగాలకు మూలకారణం.
‘‘స్వశరీరస్య మేధావీ కృత్యేషు అవహితోభవేత్’’ 
జ్ఞానవంతుడు తన ఆరోగ్యం విషయంలో అప్రమత్తుడై ఉండాలి.

శృంగారం- విశిష్టత
‘‘స్మృతి మేధా ఆయురారోగ్య పుష్టీంద్రియశోబలైః
అధికా మందజరసో భవంతి స్త్రీషు సంయతాః॥
క్రమశిక్షణతో కూడిన శృంగారం వల్ల ఆయువు పెరుగుతుంది. యౌవనంతో ఉండే కాలవ్యవధి పెరుగుతుంది. అంటే దీర్ఘకాలం పాటు వయసు పైబడదు. ఫలితంగా అన్ని ఇంద్రియాలూ పుష్టిగావుండి, తెలివితేటలు పెరిగి, శక్తిమంతులై, ధీమంతులై ఆరోగ్యంగా ఉంటారు.

ఎలాంటి ఆహారం తినాలి?
దేహపోషణార్థం మనం సేవించే ఏ పదార్థమైనా ‘‘అన్నమే’’. వరి, గోధుమ, బార్లీ, రాగులు వంటి ఏ ద్రవ్యంతో చేసినా లేదా వంటతో సంబంధంలేని కందమూలాలు, ఫలాలైనా; ఘనద్రవాలవంటి ఏ రూపంతో ఉన్నా; భక్ష్య, చోష్య, పాన, లేహ్య విధానాల్లో ఎలా సేవించినా అది ఆహారమే. సృష్టిలోని వివిధ పదార్ధాల్లోంచే ఆహారం లభిస్తుంది. కనుకనే పంచభూతాత్మకమైన ఆహారం పంచభూతాత్మకమైన శరీరాన్ని పోషిస్తుంది. దీనినే సుశ్రుతాచార్యులు ఈక్రింది శ్లోకంలో ఇలా వివరించారు.

‘‘పంచభూతాత్మకే దేహేతి ఆహారః పాంచభౌతికః
విపక్వః పంచధా సమ్యగ్గుణాన్ స్వానభివర్ధయేత్‌॥
ఆహారం శరీరానికి మనసుకి శక్తినిచ్చి ఓజస్సుని వృద్ధి చేస్తుంది.

ఆహార వర్గీకరణ
నాలుకకు కలిగే రుచిని బట్టి, ఆహారాన్ని ఆయుర్వేదం ఆరురకాలుగా విభజించింది. ప్రధాన రసం, అనుబంధ రసం అనేవి సాంకేతిక విశ్లేషణ క్రిందకు వస్తాయి. షట్స్రాలు ఈక్రింది విధంగా ఉన్నాయి.
‘‘మధుర (తీపి), అమ్ల (పులుపు), లవణ (ఉప్పు), కటు (కారం లేక తీక్ష్ణం), తిక్త (చేదు), కషాయ (వగరు).’’
⇒ వాటి గుణకర్మల్ని బట్టి ‘‘లఘు, గురు, శీతల, ఉష్ణ, రూక్ష (పొడిపొడిగా ఉండేవి), స్నిగ్ధ (జిగురుగా ఉండేవి)’’ మొదలగు రకాలుగా విభజించింది.
⇒ మనసు మీద చూపే ప్రభావాన్ని బట్టి, ‘‘సాత్వికాహారం, రాజసాహారం, తామసికాహారం’’గా చెప్పారు.

సమీకృతాహారం (ఆయువర్ధకం):
పైన పేర్కొన్న ఆరు రసాలను అలవాటు చేసుకోవడం ఉత్తమం. కొంచెం మధుర రసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆహారం సాత్మ్యంగా (సరిపడేదిగా), హితకరంగా (నచ్చినదిగా), లఘు, ఉష్ణ, స్నిగ్ధకరంగా ఉంటే శ్రేష్ఠం. ఇలాంటి ఆహారాన్ని ఆయుఃవర్ధకంగా చెప్పారు.
ఇక్కడ విశేషమేమిటంటే ఈ ఆరు రసాలలోనూ ఉప్పు (లవణం)ని ఎక్కువ వాడవద్దని హెచ్చరించింది ఆయుర్వేదం. దాంతో బాటే పిప్పళ్లు మరియు క్షారం (ఉప్పు సాంద్రత కలిగినవి)లనూ నిషేధించింది. దాని దుర్గుణాలను కూడా చరకాచార్యులు ఈక్రింది శ్లోకంలో ఇలా చెప్పారు. 
‘‘అథఖలు త్రీణి ద్రవ్యాణి నాతి
ఉపయుంజీతాధికం
అన్యేభ్యోద్రవ్యేభ్యః తద్యథా -
పిప్పలీః, క్షారం, లవణమితి’’
‘‘అతి లవణ సాత్మ్యాః పురుషాః తేషామపి
ఖాలిత్య, ఇంద్రలుప్త, పాలిత్యాని
తథా వలయశ్చాకాలే భవంతి’’
⇒ ఉప్పును అధికంగా తీసుకునేవారికి బట్టతల, వెంట్రుకలూడటం, నెరిసిపోవడం, చర్మం ముడతలు పడటం... ఇవి తరుణ వయసులోనే సంభవిస్తాయి.

ఎంత ప్రమాణం తినాలి?
‘మితం’గా తినాలి. అంటే శిశువులు, యువకులు, వృద్ధులు తమ వయసును బట్టి తగినంత తిని తదనుగుణంగా వ్యాయామం చెయ్యాలని ఆయుర్వేదం చెబుతోంది. వృత్తిని బట్టి సుకుమారులు, కాయకష్టం చేసేవారు, మానసిక శ్రమకి గురయ్యేవారు తమకు అనుగుణంగా తమ ప్రమాణాల్ని మార్చుకోవాలి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకమైన పోషకాంశాలున్న ఆహారాన్ని సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యాంశం ఏమిటంటే ‘అగ్ని’ (అరిగించుకునేశక్తి) బలాన్ని బట్టి ప్రతిఒక్కరూ ఆహార ప్రమాణాన్ని సరిచూసుకోవాలి. మితిమీరి తింటే అజీర్ణవ్యాధి కలుగుతుంది. ఇది ఎన్నో రకాల ఇతర వ్యాధులకు దారి తీస్తుంది.

తినవలసినవి తాగవలసినవి
ఇవి తినండి:
⇒ మొలకెత్తిన గింజలు (పెసలు నిత్యం లభ్యమౌతాయి)
⇒ నానబెట్టిన వేరుశనగపలుకులు
⇒ పచ్చికొబ్బరి
⇒ గ్రీన్‌సలాడ్లు (ఖీరా, టమాటా, కేరట్, బీట్‌రూట్ మొదలైనవి)
తాజా ఫలాలు: బొప్పాయి, జామ, సపోటా, సీతాఫలం, అరటి, బత్తాయి, కమలా, దానిమ్మ, ద్రాక్ష మొదలైనవి.
ఎండిన ఫలాలు: ఖర్జూరం, జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ మొదలైనవి.
⇒ ముడిబియ్యంతో వండిన అన్నం, గోధుమపిండి లేదా మల్టీగ్రైన్ పిండ్లతో చేసిన పుల్కాలు.
⇒ ఆకుకూరలలో తోటకూర చాలా శక్తినిస్తుంది. పాలకూర, బచ్చలికూర, మెంతికూర మొదలైనవి నిత్యం తినవచ్చు.
⇒ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా చాలా మంచివి.
⇒ శాకాహారంలోని కాయగూరలన్నీ మంచివే. ఉడికించి తినడం అలవాటు చేసుకోవాలి. చేమదుంప శక్తినిస్తుంది.
⇒ నువ్వులు (పచ్చిపప్పు), బెల్లం రోజూ 3 చెంచాలు నమిలి తినడం మంచిది. కాల్షియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది.
ఇవి తాగండి
⇒ రోజూ కనీసం 3-4 లీటర్ల మంచినీరు తాగటం మంచిది. (ఒకేసారి కాకుండా, నియమిత విరామాలతో తాగాలి. తినడానికి ముందుగాని, తిన్న తర్వాత గాని 45నిమిషాల పాటు నీరు తాగవద్దు)
⇒ వారానికి రెండుసార్లు కొబ్బరినీళ్ళు తాగితే మంచిది.
⇒ స్వచ్ఛమైన చెరకు రసం తాగితే మంచిది.
⇒ అప్పుడప్పుడు, ఉదయం ఒకగ్లాసు బార్లీ తాగితే మంచిది. రాగుల జావ కూడా శక్తికరం.
⇒ పండ్లరసాలు, పచ్చికూరల జ్యూస్‌లు చాలా మంచిది.
⇒ తేనె ఎంత తిన్నా చాలా మంచిది. బలకరం, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ప్రస్తుతం లభించే ఆహారపదార్థాలలో మంచివేవి...?
తినే ఆహారం ఏదైనా ఆ భారాన్ని తట్టుకోవలసింది ‘‘మహాకోష్ఠమే’’ (అంటే నోరు మొదలుకొని మలవిసర్జన మార్గం వరకు). ఆహారాన్ని అరిగించాల్సిన బాధ్యత జీర్ణాశయానిదైతే, ఆ సారాన్ని తగు మార్పులతో మన శరీరంలోని కణాలకు అందించే బాధ్యత కాలేయానిది. దీనినే ఆయుర్వేదం ‘యకృత్’ అని చెప్పింది. ధాతు పరిణామ ప్రక్రియ దీని ధర్మం. ఇంతటి విలువైన ఈ అవయవాన్ని (యకృత్‌అంటే లివర్‌ను) కాపాడుకోవలసిన బాధ్యత మనదే. దీనిని మనం రక్షించుకుంటే చాలు... మన దేహాన్ని అది రక్షించుకుంటుంది.

నేటి రోజుల్లో ఆరోగ్యానికి, ఆయువృద్ధికి...?
దినచర్య: తెల్లవారుజామున నిద్రలేవాలి: సూర్యోదయానికి ఒకటిన్నర గంటల ముందు సమయాన్ని బ్రాహ్మీమూహూర్తమంటారు. ఆ సమయంలో నిద్ర నుండి మేల్కొనడం వల్ల ఆరోగ్యం అభివృద్ధి చెంది, అగ్ని, క్షమత్వం, ఆయుష్షు అభివృద్ధి చెందుతాయి.
‘‘బ్రాహ్మేముహూర్తే ఉత్తిష్ఠేత్ జీర్ణాజీర్ణోనిరూపయన్‌
రక్షార్థమాయుషః స్వస్థో’’
(అష్టాంగ సంగ్రహం, సూత్రస్థానం)

దంత ధావనం: మలవిసర్జనానంతరం దంతధావనం (పళ్లు తోముకోవడం)చేసుకోవాలి. దీనికోసం వేప, కానుగ వంటి చేదు, కారం, వగరు గల పుల్లలను మెత్తగా నమిలి ఉపయోగించుకోవాలి. చిగుర్లను గాయపర్చకుండా పళ్లు తోముకోవాలి. ఈప్రక్రియను ఆహారం తిన్న తర్వాత కూడా అమలుపరచాలి.
‘‘.....ప్రాతః భుక్త్వాచ మృద్వగ్రం కషాయ కటు తిక్తకమ్,
భక్షయేత్ దంతధావనం దంతమాంసాని అబాధయన్’’
(అష్టాంగ హృదయం)

వ్యాయామం: వ్యాయామం వల్ల దేహం తేలికగా, శక్తిమంతంగా తయారవుతుంది. జఠరాగ్ని వృద్ధి చెందుతుంది. కొవ్వు కరగడం వల్ల స్థూలకాయం ప్రాప్తించదు. మంచి దేహసౌష్ఠవం ప్రాప్తిస్తుంది. చిన్నపిల్లలూ, వృద్ధులు, అజీర్ణరోగులు వ్యాయామం చెయ్యరాదు.
‘‘లాఘవం, కర్మసామర్ధ్యం దీపోర్తగ్నిః మేదసఃక్షయః
విభక్త ఘన గాత్రత్వం వ్యాయామాత్ ఉపజాయతే’’
‘‘...వాతపిత్తమయీ బాలోవౄద్ధో అజీర్ణీచతంత్యజేత్.’’

యోగసాధన: యోగసాధన వల్ల (ఆసనాలూ, ప్రాణాయామం, ఆత్మజ్ఞానసముపార్జన) మనిషికి ఆరోగ్యసిద్ధి (మానసిక, శారీరక, ఆత్మానుగత) లభిస్తాయి.
‘‘యోగేన చిత్తస్యపదేన వాచాం మలం శరీరస్యతువైద్యకేన
యోపా కరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలి- రానతోస్మి’’
(చరక సంహిత)

శరీరానికి నలుగు పెట్టుకోవడం, స్నానం : కొన్ని చూర్ణాలతో శరీరానికి చేసే మర్దనను (నలుగు పెట్టడాన్ని)
‘‘ఉద్వర్తనం’’ అంటారు. దీని వల్ల కఫం హరించుకుపోయి, స్థౌల్యం (స్థూలకాయం) తగ్గి, చర్మం ప్రకాశిస్తూ, అంగసౌష్ఠవం కలుగుతుంది. (ఈ ప్రక్రియను వారానికి ఒకసారి చేసినా ప్రయోజనకరమే)
‘‘ఉద్వర్తనం కఫహరం మేదసః ప్రవిలాయనం
స్థిరీకరణం అంగానాం త్వక్ ప్రసాదకరం పరం’’
⇒ నిత్యం స్నానం చేయడం వల్ల అగ్నిదీప్తి, శుక్రవృద్ధి, ఓజస్సు, బలం, ఆయువృద్ధి సిద్ధిస్తాయి. శరీరం మలిన రహితమవుతుంది. దురద, చెమట, కునికిపాట్లు, దప్పిక, మంట హరించుకుపోతాయి. వ్యాధిగ్రస్తునికి సైతం తాను రోగిననే భావన దూరమవుతుంది.
‘‘స్నానం దీపనం ఆయుష్యం వృష్యం ఊర్జాబలప్రదం
కండూ మలశ్రమస్వేద తంద్రా తృట్ దాహ పాప్మజితం’’

నిత్యం తలకు నూనె రాసుకోవడం వల్ల: ప్రతిరోజూ తలకు నూనె రాసుకుంటే శిరశ్శూల, బట్టతల, వెంట్రుకలు నెరిసిపోవడం, ఊడిపోవడం వంటి సమస్యలు దూరమవుతాయి. కపాలానికి బలం చేకూరుతుంది. కేశ మూలములు దృఢంగా ఉంటాయి. కేశాలు నల్లగా, పొడవుగా అవుతాయి. శిరస్సునకు తైలమర్దనం చేసుకోవడం వల్ల ఇంద్రియ నైర్శల్యం, చక్కటి చర్మకాంతి, సుఖ నిద్ర కలుగుతాయి.
‘‘నిత్యం స్నేహార్ద్ర శిరసః శిరఃశూలం నజాయతే
నఖాలిత్యం నపాలిత్వం నకేశాః ప్రపతంతి చ,
బలం శిరః కపాలానాం విశేషేణ అభివర్ధతే
దౄఢమూలాశ్చ దీర్ఘాశ్చ కౄష్ణాః కేశాభవంతి చ,
ఇంద్రియాణి ప్రసీదంతి సుత్వక్ భవతి చామలమ్
నిద్రాలాభః సుఖంచ స్యాత్ మూర్ధ్ని తైల నిషేవణాత్’’

ఏయే వేళల్లో తినాలి?
మధ్యాహ్నం, సాయం సంధ్యవేళల్లో తినటం ఉత్తమం. భోజనానికి, అల్పాహారానికి మధ్య కనీసం నాలుగైదు గంటల వ్యవధి ఉండాలి. ఆకలి కానప్పుడు, తిన్నది జీర్ణం కానప్పుడు మళ్లీ తినకూడదు. అదేపనిగా ఉపవాసాలూ చెయ్యకూడదు. ప్రతిరోజూ నియమిత వేళల్లోనే తినాలి. వారానికొకసారి ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచిది.
అన్నాన్ని సేవించడం ‘అశనం’ అంటారు. పథ్యా పథ్యాల్ని గమనించి సేవించడం ‘సమశనం’ అంటారు. అతిగా తినడాన్ని ‘అధ్యశనం’గా చెప్పారు. అధిక ప్రమాణంగాని, అల్ప ప్రమాణంగాని వేళకాని వేళల్లో తింటే ‘విషమాశనం’గా వర్ణించింది ఆయుర్వేదం. వీటివల్ల అజీర్ణ వ్యాధి కలగడమే కాకుండా, అతిదారుణమైన వ్యాధులూ సంభవించవచ్చు.

కాలానుగుణంగా ఆహారంలో మార్పు (రుతువులను బట్టి):
శిశిరం (ఫిబ్రవరి, మార్చి)- తీపి, పులుపు, ఉప్పు రుచులు, వేడిగా, స్నిగ్ధంగా ఉండాలి వసంతం (మార్చి, ఏప్రిల్, మే): చేదు, కారం, వగరుగా ఉండేవి, పొడిపొడిగా, వేడిగా ఉండాలి గ్రీష్మ (మే, జూన్, జూలై): తీపి, చల్లవిగా ఉండే స్నిగ్ధ (జిడ్డుగా) పదార్థాలను, ద్రవాహారాన్ని సేవించాలి వర్ష (జూలై, ఆగస్టు, సెప్టెంబర్): తీపి, పులుపు, స్నిగ్ధ పదార్ధాలు, వేడివేడిగా శరత్ (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్): తీపి, చేదు, వగరు, రూక్ష (పొడిగా ఉన్నవి - అంటే జిడ్డులేనివి), చల్లగా ఉండాలి హేమంత (నవంబరు, డిసెంబరు, జనవరి): తీపి, పులుపు, ఉప్పు, స్నిగ్ధ, ఉష్ణ పదార్థాలు.

‘పథ్యం’ అంటే?:
సరిపడేది, హితకరం అని అర్థం. దీనికి వ్యతిరేకం ‘అపథ్యం’. ఇది శరీర స్వభావాన్ని బట్టి, అగ్నిబలాన్ని బట్టి, వ్యాధి స్వభావాన్ని బట్టి, వాడే ఔషధాన్ని బట్టి తినగదినవి, తినకూడనివి అయిన ఆహార పదార్థాల్ని వివరించింది ఆయుర్వేదం. ఉదా: అజీర్ణంలో తేలికయైన (లఘు) ఆహారం తీసుకోవాలి. జ్వరంలో కూడా; మధుమేహవ్యాధిలో - మధుర, స్నిగ్ధ ఆహారం అపథ్యం; చేదు పదార్థాలు పథ్యం.
‘‘పథ్యాన్ని సక్రమంగా పాటిస్తే ఔషధమే అవసరముండదు. పాటించకపోతే ఔషధం పనిచేయదు’’ - అని వాగ్భటాచార్యులు నొక్కి చెప్పారు.

నిషేధాలు
⇒ ప్రధానంగా కొవ్వు పదార్ధాలను విసర్జించాలి. అంటే నూనె, నెయ్యిలతో వండిన వంటకాలన్న మాట. శరీరానికి కావలసిన కొవ్వులు మనకి ప్రకృతి ప్రసాదించిన ఆహార పదార్ధాలలో (ఉదా: పాలు, పెరుగులలో) లభిస్తాయి. నువ్వులనూనె, ఆవునెయ్యి - వీటిని కొంచెం ప్రమాణంలో నెలకు రెండుసార్లు సేవిస్తే మంచిది. అవి హానికరం కావు. మనం చేసే శారీరక శ్రమ, వ్యాయామాన్ని బట్టి వీటి ప్రమాణాలను సరిచేసుకోవాలి.
⇒ ఐస్‌క్రీములు, శీతల పానీయాలు, చాక్లెట్లు, బేకరీ సరుకులు, ఫాస్ట్‌ఫుడ్స్‌ల వల్ల పోషకవిలువలు శూన్యం.
⇒ సాత్వికాహారమైన శాకాహారం అత్యుత్తమం. అలవాటుంటే మత్స్యమాంసాలను అరుదుగా మాత్రమే తినడం శ్రేయస్కరం.
⇒ రోడ్డుపక్కన లభించే పళ్లరసాలు, చెరకురసాలు సేవించడం ప్రమాదకరం. ఇన్‌ఫెక్షన్ల వల్ల మహాకోష్ఠం దెబ్బతింటుంది. అలాగే బజ్జీలు, దోసెల లాంటివి కూడా. నూనెలను పదేపదే మరిగించడం చాలా హానికరం.
⇒ ఆహార నియమాలను ఉల్లంఘిస్తూ, వేళాపాళా లేకుండా ఇష్టానుసారంగా తినడం వల్ల లివర్ దెబ్బ తింటుంది.

నిద్ర
నిద్ర: మనసు బడలికనొందగనే ఇంద్రియాలు కూడా అలసిపోయి తమతమ నిర్ణీత కర్మల నుంచి దూరమవుతాయి. దాంతో మనిషికి నిద్రవస్తుంది. ఒక్క వేసవికాలంలో తప్ప పగటి నిద్ర నిషేధం.
‘‘యదాతు మనసి క్లాన్తే కర్మాత్మానః క్లమాన్వితాః
విషయోభ్యో నివర్తంతే తదా స్వపితి మానవః’’
(చరక సంహిత)
మద్యనిషేధం: మద్యాన్ని తయారుచేయడం, విక్రయించడం, తాగడం, ఇతరులకు ఇవ్వడం శస్త్రనిషేధం.

‘‘సర్వధా ఈక్షేత్ న ఆదిత్యం, న భారం శిరసావహేత్
నఈక్షేత ప్రతతం సూక్ష్మదీప్తా మేధ్యాప్రియాణిచ
మద్య విక్రయ సంధాన దానపానానిన ఆచరేత్’’

దీంతో పాటు సూర్యకాంతిని నేరుగా చూడవద్దు. తలపై అధికభారం మోయవద్దు. అత్యంత సూక్ష్మం, అత్యంత తీక్షణమైనవీ, మనసుకి అప్రియాలైన వస్తువులను తదేక దృష్టితో చూడకూడదు.
మన ఆరోగ్యం కోసం ఆయుర్వేదం సూచించిన పైన పేర్కొన్న అన్ని నియమాలనూ క్రమం తప్పక పాటిస్తే నిండు నూరేళ్ళూ ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment