ఈ శివుడు   కాకతీయుల ఆరాధ్యుడు  శ్రీ శంభులింగేశ్వరస్వామి   ఖిలా వరంగల్ కోట  Sri ShambhulingeswaraSwamy Khila Warangal Fort


ఈ శివుడు...
కాకతీయుల ఆరాధ్యుడు!
శ్రీ శంభులింగేశ్వరస్వామి 
ఖిలా వరంగల్ కోట
Sri ShambhulingeswaraSwamy 
Khila Warangal Fort 

ఈ శివుడు   కాకతీయుల ఆరాధ్యుడు  శ్రీ శంభులింగేశ్వరస్వామి   ఖిలా వరంగల్ కోట  Sri ShambhulingeswaraSwamy Khila Warangal Fort



ఈ శివుడు కాకతీయుల ఆరాధ్యుడు!

భక్త సులభుడూ బోళా శంకరుడూ అయిన పరమశివుడు ఎన్నో రూపాల్లో పూజలందుకుంటున్నాడు. వాటిలో ప్రముఖమైందీ అతి ప్రాచీనమైందీ ఖిలా వరంగల్‌లోని కోటలో వెలసిన స్వయంభూ శంభులింగేశ్వరస్వామి క్షేత్రం. కాకతీయుల ఆరాధ్య దైవంగా, భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న స్వామి దర్శనం సర్వశుభప్రదం. 



చెంబెడు నీళ్లు అభిషేకిస్తే చాలు మహదానంద పడిపోయే ఆ జంగమయ్య ఆర్తితో తలచినంతనే నేనున్నానంటూ అభయమిస్తాడు. ఆ దేవదేవుడి నిలయంగా పురాతన క్షేత్రాల్లో ఒక్కటిగా గుర్తింపు పొందిన ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలకు నెలవు. ఇతరవాటికి భిన్నంగా దక్షిణ ముఖంగా దర్శనమిచ్చే నందీశ్వరుడి చెవిలో కోరికను చెబితే అది పరమేశ్వరునికి చేరుతుందని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు శంభులింగేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం నందీశ్వరుడి చెవిలో తమ కోర్కెలు చెబుతుంటారు. అవి నెరవేరిన తర్వాత మళ్లీ వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.


విశిష్ట చరిత్ర 

హన్మకొండ రాజధానిగా పరిపాలన సాగించిన కాకతీయ రాజులు అప్పట్లో అరణ్యంగా ఉన్న ఖిలా వరంగల్‌ ప్రాంతానికి వేటకు వచ్చారు. మార్గమధ్యంలో వారి రథం భూమిలో కూరుకుపోయింది. రథచక్రాన్ని బయటికి తీయాలని ఎంత ప్రయత్నించినా రాలేదు. అలసిన రాజులు అక్కడే సేదతీరారు. ఆ రాత్రి స్వప్నంలో పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు. రథచక్రం కూరుకుపోయిన ప్రాంతంలో తన ఆలయం ఉందని చెప్పి అదృశ్యమయ్యాడు. ఆ వెంటనే మేల్కొన్నవారికి భూమిలో కూరుకుపోయిన ఇనుప రథచక్రం కాస్తా బంగారంగా మారి కనిపించింది. వెంటనే అక్కడ తవ్వకాలు చేపట్టగా పురాతన ఆలయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎవరూ ప్రతిష్ఠించకుండానే వెలసిన దేవాలయంగా స్వయంభూ శంభులింగేశ్వరస్వామి క్షేత్రం ఏర్పడినట్లు స్థలపురాణం తెలియజేస్తోంది. అప్పటి నుంచీ కాకతీయులు శివుడిని తమ ఆరాధ్య దైవంగా భావించి పూజించారు. ఈ దేవస్థానాన్ని క్రీ.శ.1162 సంవత్సరంలో గణపతిదేవ చక్రవర్తి అభివృద్ధి చేశాడు. భూభాగం పుష్పాకారాన్నీ, పైకప్పు నక్షత్రాకారాన్నీ పోలినట్లుగా రాతితో ఈ ఆలయాన్ని నిర్మించారు. అనంతర కాలంలో త్రిభుజాకారంలో 40 అడుగుల ఎత్తున్న గోపురాన్ని హైందవ సంప్రదాయం ప్రకారం తేలికపాటి ఇటుకలను ఉపయోగించి నిర్మించారు. దేవాలయ ప్రాంగణంలోనే అంతరాలయం, నాట్యమండపాలను ఏర్పాటు చేశారు.


అన్నీ ప్రత్యేకతలే... 

ఈ ఆలయంలోని శివలింగం భూమికి అతి తక్కువ ఎత్తులో ఉంటుంది. ప్రత్యేక అభిషేకాలు చేసిన అనంతరం భక్తులే స్వయంగా శివలింగానికి పూజలు చేయడం ఈ ఆలయ ప్రత్యేకత. సాధారణంగా కాకతీయులు నిర్మించిన వివిధ దేవాలయాల్లో ఉత్తర ముఖంగా నందీశ్వరుడు ఉంటాడు. కానీ, ఈ క్షేత్రంలో మాత్రం నందీశ్వరుడు దక్షిణ ముఖంగా దర్శనమిస్తాడు. దక్షిణ ద్వారం వద్ద వీరభద్రస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఏటా శివరాత్రి మహోత్సవం సందర్భంగా ఇక్కడ విశేష పూజలూ, శివపార్వతుల కల్యాణాలూ, మహా రుద్రాభిషేకాలూ నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి సోమవారం రుద్రాభిషేకాలూ, అర్చనలూ, ప్రత్యేక హారతులతో పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా చేస్తారు. ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు.


ఎలా చేరుకోవాలంటే... 

ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి రైలు రోడ్డుమార్గాలు అందుబాటులో ఉన్నాయి. రైల్లో వస్తే వరంగల్‌ రైల్వేస్టేషన్‌ సమీప కేంద్రం. అక్కడి నుంచి సుమారు నాలుగు కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి ఖిలా వరంగల్‌ కోటకు చేరుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల నుంచీ వరంగల్‌కు బస్సు సౌకర్యం ఉంది. విజయవాడ నుంచి ఖమ్మం మీదుగా వచ్చేవారు చింతల్‌ బ్రిడ్జి దగ్గర దిగి కోటకు చేరుకోవచ్చు. ఖమ్మం నుంచి నర్సంపేట మార్గంలో ప్రయాణించేవారు పెట్రోల్‌పంపు కూడలిలో దిగి శంభులింగేశ్వరస్వామి ఆలయానికి చేరుకోవచ్చు.
- వానపల్లి శ్రీనివాసరావు,  వరంగల్‌ 
ఫొటోలు: ఎస్‌.కృష్ణమూర్తి




ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment