Sai Satcharitra, sai satcharitra telugu,sai nitya parayanam, sai baba books free download, sai baba jeevitha charitra in telugu శ్రీ సాయిబాబా సచ్చరిత్ర | Sri Saibaba Sachaaritra | GRANTHANIDHI | MOHANPUBLICATIONS |

శ్రీ సాయిబాబా సచ్చరిత్ర 
 Sri Sai Satcharitra
Rs 108/-
-------------------------------------
సాయి రూపం జ్ఞాన దీపం
సాయినాధుని సమకాలీకులైన హేమాడ్‌ పంత్‌ 1929లో రచించిన శ్రీ సాయి సచ్ఛరిత్ర నుంచి సేకరించిన వివరాలివి...
యాసాయీ (రండి సాయి)... అన్న షిరిడీ వాసుల ఆహ్వానం కోట్లాది మంది అదృష్టం పండించింది... ఓ పెళ్లి బృందంతో పాటు ఆ మారుమూల గ్రామంలో అడుగుపెట్టిన ఆ ఫకీరు తర్వాత భక్త హృదయ చక్రవర్తిగా మారిన వైనం అద్భుతం... అపూర్వం... ‘మాఝియా భక్తాంబే ధామీ! అన్నవస్త్రాంస నాహీకమి!’ నా భక్తుల ఇళ్లలో అన్నవస్త్రాలకు లోటుండదని పలికిన ఆ యోగి రాజు లీలలు సదా స్మరణీయాలు... ఆయన జీవితంలో ప్రతి ఘట్టం హృదయాన్ని ఆనందడోలికల్లో ముంచెత్తుతుంది... బతుకు పాఠాలు నేర్పుతుంది... ఆ మహాత్ముడి సమాధి శతాబ్ధి సందర్భంగా అందులో కొన్ని..
వారు... నేనే!
సాయి సంపూర్ణ అద్వైత స్ధితికి నిదర్శనంగా నిలిచేవారు. తాను షిరిడీ వదిలి ఒక్కరోజు కూడా బయట లేకున్నా  ఆయన సర్వవ్యాపకత్వాన్ని అడుగడుగునా ప్రదర్శించేవారు.
నాందేడ్‌కు చెందిన రతన్‌జీ మిల్లుకాంట్రాక్టరు. శ్రీమంతుడు. పిల్లలు కలగడం లేదని బాబా దగ్గరకు వచ్చారు అప్పుడు బాబా అతనితో  ‘నువ్వు నాకు మూడు రూపాయల పద్నాలుగు అణాలు ఇచ్చావు. అది నాకు గుర్తుంది. మిగిలిన బాకీని నాకు దక్షిణగా ఇవ్వమ’ని అడిగాడు. రతన్‌జీ బాబాను చూడడం అదే మొదటిసారి. ఎంత గుర్తు చేసుకున్నా బాబా మాటలు అంతుబట్టడం లేదు. అయినా దక్షిణ ఇచ్చి నమస్కరించి బాబా పాదాల చెంత కూర్చున్నాడు. బాబా ‘నీ దురదృష్టం దూరమయ్యే సమయం వచ్చిందిలే’ అని ఆశీర్వదించాడు. దీంతో రతన్‌జీ మనసుకు ప్రశాంతత కలిగినా సందేహం మాత్రం నివృత్తి కాలేదు. ‘మూడు రూపాయల పద్నాలుగు అణాలు నాకిచ్చావ’న్న మాటలో అంతరార్థం తెలీడం లేదు.  అణాలేంటి? నేేనివ్వడమేంటి? ఇదో చిక్కు ప్రశ్నలా మనసును తొలుస్తూనే ఉంది. ఎంతో ప్రయత్నించాక ఓ సంఘటన రతన్‌జీకి గుర్తొచ్చింది. రతన్‌జీ షిరిడీ వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత మౌలీ సాహెబ్‌ అనే ఒక అవులియా ఆయన ఇంటికి వచ్చారు. రతన్‌జీ ఉపచార పూర్వకంగా విందునిచ్చారు. పూలు, పళ్లు, తాంబూలాన్నీ సమర్పించారు. వాటన్నిటినీ లెక్కగడితే అయిన ఖర్చు సరిగ్గా మూడు రూపాయల పద్నాలుగు అణాలు. నాందేడ్‌ నుంచి షిరిడీ చాలా దూరం. మౌలీ సాహెబ్‌, సాయి బాబా ఒకరినొకరు ఎరగరు. అయినా ఈ విషయం ఆయనకు ఎలా తెలిసింది. సాయిలోని ఆత్మే అందరిలో ఉన్న ఆత్మ. శారీరకంగా వారిద్దరూ వేర్వేరుగా ఉన్నా ఆత్మికంగా కలిసే ఉన్నారు. సాయి అద్వైతస్ధితికి ఇదో నిదర్శనం.
...ఆ జ్ఞానముందా!
బ్రహ్మజ్ఞానం... ప్రతి జీవీ అందుకోవాల్సిన అమృతమది. దాన్ని గురించి చెప్పడానికి యోగి రాజైన సాయినాథునికన్నా గొప్ప గురువు ఎవరుంటారు?
గొప్ప సంపద, కీర్తి, సంతతి అన్నీ ఉన్న ఒక వ్యక్తి బ్రహ్మజ్ఞానం పొందాలనుకున్నాడు. రానుపోను గుర్రబ్బండి మాట్లాడుకుని షిరిడీ వచ్చాడు. 
‘బాబా చాలా దూరం నుంచి వచ్చాను. నాకు ఎలాగైనా బ్రహ్మను చూపండి’ అని అడిగాడు. 
బాబా కూడా ‘చింతపడకు. వెంటనే బ్రహ్మను చూపిస్తాను.  డబ్బు, సంతానం, సుఖాలు కోరిన వాళ్లున్నారుగానీ, నీలాగా బ్రహ్మజ్ఞానం కోసం నా దగ్గరకు వచ్చిన వాళ్లు లేరు. ఇక్కడ అరువు బేరం లేదు’ అని అతన్ని కూర్చోబెట్టి బాబా మరోపనిలో మునిగిపోయారు. 
కాసేపటి తర్వాత ఓ పిల్లవాణ్ణి పిలిచి ‘ వెంటనే వెళ్లి బాబాకి అవసరపడింది. ఓ అయిదు రూపాయలు ఇవ్వమని నందూ మార్వాడీతో చెప్పు’ అన్నారు.
పిల్లాడు నందూ వాళ్లింటికి వెళ్లి వచ్చి వాళ్లింటికి తాళం పెట్టి ఉందని చెప్పాడు. 
‘మళ్లీ వెళ్లు! బాళా వ్యాపారి ఇంటికెళ్లి అతన్నడిగి డబ్బుతే’ ఆ పిల్లాడికి చెప్పాడు బాబా... ఈ ప్రయత్నం కూడా వ్యర్థమైంది. బాళా కూడా ఇంట్లో లేడు. 
తర్వాత ఇంకో రెండు చోట్లకి బాబా పిల్లాణ్ణి పంపాడు. అయినా చిల్లుగవ్వ కూడా దొరకలేదు. 
అదే సమయంలో బ్రహ్మజ్ఞానం పొందడానికి వచ్చిన వ్యక్తి జేబులో రెండువందల యాభై రూపాయలున్నాయి. ఆ విషయం సాయినాథులకు తెలుసు. అయినా ఆ బ్రహ్మార్థి బాబాకు అయిదు రూపాయలు అప్పుగా ఇవ్వలేదు. తిరిగి వస్తాయా? లేదా? అనే సందిగ్ధత అతనిది. ధనమోహంలో చిక్కుకున్న అతను బాబాను రెట్టించి అడిగాడు ‘బ్రహ్మను చూపండి’ అని.
బాబా ఇలా అన్నారు. ‘బ్రహ్మ కోసం పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు భగవంతుడికి సమర్పించవలసి ఉంటుంది.  అరిషడ్వర్గాలను విడిచిపెట్టాల్సి ఉంటుంది. డబ్బుపై వ్యామోహం, లోభాన్ని కూడా వదల్లేని నువ్వు పరమగతిని ఎలా పొందాలనుకుంటున్నావు?
తారక మంత్రం
బాబా శిష్యుడు దాసగణు ఈశావాస్యభావార్థ బోధిని అనే గ్రంథాన్ని మరాఠీలో రాయడం మొదలుపెట్టారు.
ఉపనిషత్తులోని ‘తేన త్యక్తేన భుంజిథా’ అనే మంత్రార్థాన్ని ఎంతో మంది ఎన్నో రకాలుగా వ్యాఖ్యానించారు. రుచికరమైన దాన్ని ఒక్కరూ తినరాదనేది యథాతథ అర్థం. ‘ఈశ్వరుడు జగత్తంతా వ్యాపించి ఉన్నాడు. ఆయన అందరిలోనూ ఉన్నాడన్న విషయాన్ని గుర్తుంచుకొని విషయాలను అనుభవించాలి’ అనే అర్థాన్ని ఎక్కువమంది చెబుతారు. 
అయినా దాసగణుకి ఏదో సందేహం. 
ఓ రోజు బాబా దగ్గర ఏకరవుపెట్టాడు. 
‘నీవు ప్రశాంతంగా ఉండు. ఓ పనిపిల్ల నీ శంకను నివారిస్తుంది’ అభయమిచ్చారు బాబా
పనిపిల్లా... వేదానికి అర్థం చెప్పడమా... అందరితో పాటు దాసగణుకీ ఆశ్చర్యం. 
తర్వాత దాసగణు పార్లే గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఆయన నిద్ర మేల్కొంటున్న సమయంలో ఓ ఎనిమిదేళ్ల పాప మృదుమంజుల స్వరంతో అద్భుతంగా పాడుతోంది. నడుముకి చిరిగిన పరికిణీ కట్టుకున్న ఆ పిల్ల ఆ చీరనే వర్ణిస్తూ తన్మయత్వంతో పాడుతోంది. ఆమెకు కడుపునిండా తిండి లేదు. మంచి దుస్తులూ లేవు. అయినా ఆమెలో ఉప్పొంగుతున్న ఆనందాన్ని చూసి సంతోషపడ్డ దాసగణు అక్కడుతున్న అధికారితో ఇలా చెప్పాడు. ‘చూడండి... ఆమెకు ఓ చీరివ్వండి. మీ సేవను దేవుడు మెచ్చుతాడు’. విన్నపానికి స్పందించిన అధికారి ఓ అందమైన చీర ఆమెకు ఇచ్చాడు.
ఆ అమ్మాయి ఆ చీరను చూసి ఎంతో సంతోషించింది. దాన్ని కట్టుకుని ఇతర పిల్లలతో కలిసి ఒప్పులకుప్ప ఆడింది. మరునాడు ఆ చీరను దాచిపెట్టి ఇదివరకటి చిరిగిన బట్టల్లోనే వచ్చింది. అయినా ఆ పిల్లలో ఎలాంటి నిరుత్సాహం లేదు. అదే సంతోషం. అదే అవ్యక్తానందం. అప్పుడు తట్టింది దాసగణుకి బాబా మాటల్లోని అంతరార్థం. ‘తేన త్యక్తేన భుంజిథా’ మంత్రార్థం. 
ఆ పనిపిల్ల నిరుపేద. కడపు నిండా అన్నం, కట్టుకోడానికి దుస్తులు లేవు. అయినా ఆమె ఆనందానికి మాత్రం ఢోకాలేదు. ఇతరుల వైభవం చూసి ఆమెకు అసూయ లేదు. తన దైన్యానికి సిగ్గుపడనూ లేదు. తన పాత చీర గురించి కూడా ప్రేమతో పాట పాడింది. మర్నాడు ఆమెకు కొత్తచీర లభించింది. ఆమె దాన్ని కూడా ఇష్టంగా కట్టుకుంది. కానీ అదే సర్వస్వం అనుకోలేదు. ఆశ కలగలేదు. మర్నాడు ఆ చీరను పెట్టెలో దాచి, పాత చీర కట్టుకున్నా అంత ఆనందంగానూ ఉండిపోయిందామె. సంసారంలో ఎలా వ్యవహరించాలో బాబా ఆ పనిపిల్ల ద్వారా తెలియజెప్పారు.
అలా చూడరాదు
తనను నమ్ముకున్న వారి యోగక్షేమాలన్నీ తానే చూస్తానని మాటిచ్చారు సాయినాథులు.
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః
కామఃక్రోధస్తధా లోభ స్తస్మాదేతత్రయం త్యజేత్‌! -భగవద్గీత
కామక్రోధలోభాలు నరకానికి మూడు ద్వారాలు. వాటివల్ల మనిషికి నష్టం జరుగుతుంది. సాయి సమర్థులు అత్యంత దయామూర్తి. భక్తులకు వీటి అదుపుపై శిక్షణనిచ్చేవారు. కామం మనిషిలోని విచక్షణను అణచివేస్తుంది. దాని నుంచి భక్తులను చాకచక్యంగా బయటపడేసేవారు బాబా.
నానా సాహెబ్‌ చాంద్రోర్కర్‌ గొప్ప పండితుడు. ఉన్నత పదవులు నిర్వహించారు. బాబాకు సన్నిహితంగా ఉంటూ ఎంతో మందికి దర్శనభాగ్యం కలిగించేవాడు. తన ఉపన్యాసాలతో బాబా కీర్తిని కొంకణ్‌ ప్రాంతంలో విస్తరింపజేశారు. ఒకసారి ఒక ముస్లిం భక్తుడు తన భార్యలతో కలిసి బాబా దర్శనానికి షిరిడీ వచ్చారు. స్త్రీలంతా అప్పుడు బురఖాలు ధరించి ఉన్నారు. వాళ్లు రావడం చూసిన నానాసాహెబ్‌ చాంద్రోర్కర్‌ అక్కడి నుంచి వెళ్లాలని అనుకున్నాడు. కానీ బాబా అతన్ని ఆపారు. ఆ స్త్రీలు బాబాకు నమస్కరించేటప్పుడు తమ బురఖాలను ముఖంపై నుంచి తీశారు. అప్పుడు అందులో ఒక స్త్రీ సౌందర్యం చూసిన నానాకు ఆమెను మళ్లీమళ్లీ చూడాలనే ఆలోచన మనసులో వచ్చింది. అతని మనస్సులో కలిగిన అలజడి ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ బాబా నుంచి తప్పించుకోలేరు కదా. బాబా వారంతా వెళ్లిపోయాక నానాతో దేవుడు ఈ అందమైన సృష్టిని మనం చూసి ఆనందించడానికే ఇచ్చాడు. మనసులో దురాలోచనలకు తావివ్వకూడదని చెప్పారు. నానా కూడా సహజంగా పండితుడు, విజ్ఞుడు కావడంతో వెంటనే సాధన చేసి పరిపూర్ణత సాధించాడు. తప్పు చేయడమే కాదు తప్పుడు ఆలోచన కూడా మంచిది కాదని బాబా చాటారు.
గురు బోధ
ఆత్మహితాన్ని ఈ జన్మలోనే సాధించాలి. ప్రాణులు జన్మించగానే మృత్యువుకు చేరువవుతాయి కాబట్టి రేపు, ఎల్లుండి అని వాయిదా వేసేవారు మోసపోతారు. అందుకే పురుషార్థాన్ని కోరుకునేవారు ఉదాసీనులుగా ఉండకూడదు. సోమరితనం అసలు పనికి రాదు.’
భక్తి అంటే మధురమైన సీతాఫలం, జ్ఞానమంటే బాగా పండిన రామాఫలం. రసంతోనిండి ఒకదానికంటే మరొకటి మధురంగా ఉంటాయి. రెండింటి సుగంధం కూడా ఒక్కలాగే ఉంటుంది.’
మీరు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఫలాపేక్షను వదలండి. మీకు ఫలాన్నివ్వడానికి మీ వెనక నేను నిలబడి ఉంటాను
 - శ్రీవిజయదుర్గ


 Sai Satcharitra, sai satcharitra telugu,sai nitya parayanam, sai baba books free download, sai baba jeevitha charitra in telugu శ్రీ సాయిబాబా సచ్చరిత్ర | Sri Saibaba Sachaaritra | GRANTHANIDHI | MOHANPUBLICATIONS |

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment