ఆయుర్వేద వైద్య గ్రంధాలు




-----------------------------------------------------------------

వైద్యో నారాయణో ధన్వంతరిః 
నవంబరు 5 ధన్వంతరి జయంతి
మంచి వైద్యుడిని ధన్వంతరితో పోల్చుతాం.. యుగయుగాలుగా మన వైద్యశాస్త్రానికి మూల పురుషుడిగా పిలుచుకునే ఆయన ఎవరు?

తరతరాలుగా సంపూర్ణ ఆరోగ్యానికి సరిపోలిన అర్థం ధన్వంతరి. ఆ పేరులోనే శారీరక, మానసిక ఆరోగ్యాలు ఇమిడి ఉన్నాయి. పురాణకాలం నుంచి నేటి దాకా వైద్యానికి అధిదేవతగా ధన్వంతరిని ప్రస్తావిస్తూ ఉంటారు. పురాణాలలో సాక్షాత్తు దైవస్వరూపుడుగా పేర్కొన్న ఈ స్వామి మానవాళి సంపూర్ణ ఆరోగ్యానికి కావలసిన వాటన్నిటినీ సమకూరుస్తాడన్న నమ్మకం ప్రబలంగా ఉంది.

ధన్వంతరి అనే పదానికి సంబంధించిన అర్థాన్ని పరిశీలిస్తే.. ఆ స్వామి ఆవిర్భావ లక్ష్యం స్పష్టమవుతుంది. ‘‘ధనుః శల్యం తస్య అంతం పారం ఇయర్తి గచ్ఛతీతి ధన్వంతరిః’’ అని పండితులు పేర్కొన్నారు. అంటే ధనుస్సు నుంచి వెలువడిన బాణపు ములుకుల్లాంటి శారీరక, మానసిక దోషాలు, రోగాలు, బాధలను నివారించేవాడని అర్థం. శరీరానికి తగిలే తీవ్రమైన గాయాలు, అనేక కారణాల వల్ల పుట్టుకొచ్చే వ్రణాలు, అలాగే మానసిక వ్యాధులన్నింటినీ తగ్గించేవాడని అర్థం. దీనిని అనుసరించి పూర్వకాలం నుంచి చికిత్సలు, శస్త్రచికిత్సలలో ఆరితేరిన వారిని ధాన్వంతరీయులు అని పిలుస్తూ గౌరవించడం కనిపిస్తుంది.

ఎలా ఉంటాడు? 
ధన్వంతరి సాక్షాత్తు దైవమే. శ్రీమహావిష్ణువు స్వరూపుడే. ఆ స్వామి ధర్మరక్షణ కోసం అవసరమైనప్పుడల్లా ప్రతి యుగంలో జన్మించినట్టే.. ధన్వంతరి కూడా మానవాళికి వైద్యాన్ని అందించేందుకు పలుజన్మలను ఎత్తినట్టు పురాణ కథలు పేర్కొంటున్నాయి. ధన్వంతరి స్వరూప వర్ణన కూడా పలు రకాలుగా కనిపిస్తుంది. వాల్మీకి రామాయణం బాలకాండలో ధన్వంతరి ఆవిర్భావ ప్రస్తావన ఉంది. దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు ఒక చేత కమండలం, మరోచేత దండాన్ని ధరించి ధన్వంతరి ఆవిర్భించినట్టు తెలుస్తోంది. భాగవతంలో.. క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన అమృతభాండాన్ని చేతపట్టుకొని ఉన్నట్టు కనిపిస్తుంది. బ్రహ్మవైవర్త పురాణం కృష్ణ జన్మఖండంలో సూర్యభగవానుడి దగ్గర ధన్వంతరి ఆయుర్వేదాన్ని నేర్చుకున్నట్టు, సూర్యుడికి ఉన్న పదహారు మంది శిష్యుల్లో ఈయన కూడా ఒకరని ప్రస్తావించారు,. విష్ణుధర్మోత్తర పురాణంలో ఒకచేత అమృత కలశం, మరోచేత వనమూలికలను పట్టుకొని ఉన్న ధన్వంతరి వర్ణన ఉంది. మరికొన్ని చోట్ల శ్రీమహావిష్ణువులా నాలుగు చేతులు, పీతాంబరాలు ధరించి పైరెండు చేతుల్లో శంఖచక్రాలు, కింది రెండు చేతుల్లో జలగ, అమృత కలశాన్ని పట్టుకొని ఉన్నట్టుగా పేర్కొన్నారు. జలగను పట్టుకోవడం శస్త్రచికిత్సకు సంబంధమైన సూచన అని పండితుల వివరణ.

హరివంశ కథ 
హరివంశ పురాణం 29వ అధ్యాయంలోని కథ ప్రకారం క్షీరసాగర మథనమప్పుడు సాగర గర్భం నుంచి ఒక దివ్యపురుషుడు పుట్టుకొచ్చాడు. చక్కటి రూపం, శంఖంలాంటి కంఠం, పద్మాల్లాంటి కళ్లు, సుతిమెత్తని సుందర కేశజాలంతో దృఢమైన నల్లని శరీరంతో పీతాంబరాలను ధరించి, మణికుండలాలు, పుష్పమాలలు అలంకరించుకొని, చేతిలో అమృతకలశంతో ఆవిర్భవించాడు. బ్రహ్మాది దేవతలు ఆయనకు ధన్వంతరి అని పేరు పెట్టారు. నీటిలో నుంచి పుట్టినవాడు కాబట్టి అబ్జ అనే పేరును శ్రీమహావిష్ణువు ఆయనకు పెట్టారు. మరో జన్మలో తల్లి గర్బంలో పుట్టి యజ్ఞభాగాన్ని స్వీకరించేలా అనుగ్రహించారు. మహావిష్ణువు చెప్పినట్టే ద్వాపరయుగంలో కాశీరాజు సుహోత్రుడికి పుత్రుడుగా జన్మించిన ధన్వంతరి. ఆయుర్వేదశాస్త్రాన్ని అష్టాంగాలతో రచించాడు. కాయచికిత్స, కౌమారభృత్య (బాల చికిత్స), భూతవైద్యం (గ్రహ చికిత్స), శలాక్యతంత్ర, శల్యతంత్ర (శస్త్ర చికిత్స), విషతంత్ర, రసాయన తంత్ర, వశీకరణ తంత్ర అనే అష్టాంగాలతో ఆయుర్వేద శాస్త్రాన్ని ధన్వంతరి మానవాళికి అందించాడు. అలాగే మహాభాగవతం నవమ స్కంధంలో పురూరవ వంశ క్రమంలో ధన్వంతరి మూడో తరానికి చెందిన దివోదాసుడుగా కనిపిస్తాడు. ఈయననే దివోదాస ధన్వంతరి అని కూడా పిలుస్తుంటారు.
వైద్యశాస్త్రానికి అధిపతి కనుకనే ఈ స్వామికి ఎన్నోచోట్ల ఆలయాలు వెలిశాయి. తమిళనాడులోని శ్రీరంగనాథస్వామి ఆలయం ఆవరణలో ధన్వంతరి మందిరం ఉంది. కేరళలోని నెల్లువాయతో పాటు చాలాచోట్ల ధన్వంతరి ఆలయాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ తూర్పుగోదావరి జిల్లా చింతబారులో ధన్వంతరి ఆలయం ఉంది. - డా।। యల్లాప్రగడ మల్లికార్జునరావు

 --------

కషాయాలతో ఆటకట్టు....
24-12-2018 23:56:00

కషాయం అనగానే ఏదో కపాలానికి తాకినట్లే అనిపిస్తుంది. తేనీరు కూడా కషాయమే కదా మరి? దానికి ఏమనుకోవాలి? టొమాటో సూప్‌, ఉలవచారు, చింతపండు రసం ఇవన్నీ కషాయాలే ! ఆరోగ్యం మెరుగవ్వాలంటే రుగ్మతకు తగిన ఔషధ కషాయం తాగాల్సిందే!

బాహ్య కషాయాలు!
కషాయం రూపంలో తీసుకునే ఆయుర్వేద ఔషధాలు రెండు రకాలు. ఒకటి అంతర్గతంగా తీసుకునేవి, మరొకటి బాహ్యంగా వాడేవి. ఆయుర్వేదం ఇలాంటి వేల రకాల ఔషధ కషాయాల్ని తయారు చేసింది. ఉదాహరణకు వేడినీళ్లల్లో వావిలాకు వేసుకుని స్నానం చేయడం అనాదిగా వస్తున్న అలవాటే కదా! ఈ స్నానం వల్ల ఒంటి నొప్పులు తగ్గుతాయి. ఇవీ కషాయాలే! కాకపోతే బాహ్యమైనవి. ఎగ్జిమా, సొరియాసిస్‌ లాంటి వ్యాధులు ఉన్నవాళ్లు మరిగే నీళ్లల్లో వేపాకు వేసి, ఆ నీళ్లతో స్నానం చేస్తారు. కుంకుడు కాయల్ని కూడా వేడినీళ్లల్లో వేసి స్నానం చేస్తే, కొన్ని రకాల చర్మ వ్యాధులు తగ్గే అవకాశం ఉంది.

కొన్ని రకాల మూలికల్ని చూర్ణాలుగా చేస్తేనే మేలు. మరి కొన్నింటిని మాత్రం కషాయమే చేయాలి! ప్రయోజనాలు అనేవి మూలికల మూలకాల మీదే కాదు. కషాయాల తయారీ పైన కూడా ఆధారపడి ఉంటాయి. మూలికల ప్రత్యేకతలు, వివిధ ప్రయోజనాల ఆధారంగా కషాయాలు తయారు చేసుకోవాలి. రుగ్మత స్వభావం, తీవ్రతలను బట్టి ఇంటిపట్టునే తయారుచేసుకోగలిగే కషాయాలు బోలెడన్ని!

థైరాయిడ్‌ సమస్యలకు
థైరాయిడ్‌ సమస్య సర్వసాధారణమైపోయింది. థైరాక్సిన్‌ హార్మోన్‌ హెచ్చుతగ్గులకు లోనుకాకుండా సజావుగా విడుదలవ్వాలంటే థైరాయిడ్‌ గ్రంథిని సక్రమంగా పనిచేయించే కషాయం తీసుకోవాలి. ఇందుకోసం ధనియాల కషాయం వాడాలి.

కావలసిన దినుసులు:
ధనియాలు - ఒక చెంచా
త్రికటు చూర్ణం (శొంఠి, మిరియాలు, పిప్పళ్లు) - అర చెంచా
నీళ్లు - ఒక గ్లాసు
తయారీ ఇలా!
ఈ కషాయం రెండు విధాలుగా తయారు చేసుకోవచ్చు!
శీతల కషాయం: ధనియాలు దంచి రాత్రివేళ చల్లని నీళ్లలో వేసి ఉదయాన్నే వడబోసుకొని తాగాలి.
వేడి కషాయం: ధనియాలను దంచి రాత్రివేళ వేడినీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే వడబోసుకొని తాగాలి.
ఇలా తాగలేనివాళ్లు నీళ్లకు బదులు శీతలపానీయంలో ధనియాల పొడి, త్రికటు చూర్ణం కలిపి తాగవచ్చు.


కంటి చూపు కోసం...
ఇది బాహ్య కషాయం. కంటి సమస్యలు, చూపు మందగింపు లాంటి ఇబ్బందులు ఈ కషాయంతో తొలగుతాయి.

కావలసిన దినుసులు:
త్రిఫల చూర్ణం - రెండు స్పూన్లు
నీళ్లు - తగినన్ని

తయారీ విధానం:
నీళ్లలో త్రిఫల చూర్ణాన్ని కలిపి, నాలుగో వంతు వచ్చేవరకూ మరిగించి చల్లార్చాలి.
ఈ కషాయాన్ని వడగట్టి ఉంచుకోవాలి.
అడుగున పేరుకున్న గసి కాకుండా, పైన తేలిన నీటితో కళ్లను కడుక్కోవాలి.
ఇలా రోజుకు ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది.
త్రిఫల చూర్ణాన్ని పొట్టలోకి తీసుకున్నా కంటి సమస్యలు తగ్గుతాయి. రాత్రి భోజనం తర్వాత ఈ కషాయాన్ని నెల రోజులపాటు తీసుకుంటే ఫలితం ఉంటుంది.

కిడ్నీ సమస్యలకు
కొత్తిమీర కషాయం కిడ్నీ సమస్యలకు బాగా పనిచేస్తుంది. కిడ్నీలకు సంబంఽధించి సాధారణంగా యూరినోబ్లాడర్‌ సమస్యలు, కిడ్నీ దెబ్బ తిన్నప్పుడు క్రియాటిన్‌ లెవల్‌ పెరగడం, కిడ్నీ పనితనం తగ్గడం, వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలకు కొత్తిమీర కషాయం చక్కగా పని చేస్తుంది.

కావలసిన దినుసులు:
కొత్తిమీర - గుప్పెడు
నీళ్లు - 1 గ్లాసు
తయారీ విధానం:
నీళ్లలో కొత్తిమీర వేసి మరిగించాలి.
నీళ్లు నాలుగో వంతు వచ్చేవరకూ మరిగించి, చల్లార్చాలి.
ఈ కషాయాన్ని రోజుకి రెండు పూటలు తీసుకోవాలి.
ఇలా వరుసగా 40 రోజులు వాడి, ఓ 10 రోజులు మానేసి మళ్లీ తాగడం మొదలెట్టాలి. ఇలా చేస్తే పలురకాల కిడ్నీ సమస్యలు తగ్గుతాయి.

పరిణామ శూలకు...
అన్నం తిన్న రెండు మూడు గంటల తర్వాత కొందరికి కడుపులో నొప్పి వస్తుంది. దీన్ని పరిణామ శూల అంటారు. తిన్న ఆహారం జీర్ణాశయం దాటి ఎప్పడైతే బయటికి వస్తుందో అంటే డియోడినం (చిన్న పేగు పారంభం)లో ఏదైనా అల్సర్‌ ఉంటే నొప్పి వస్తుంది.

కావలసిన దినుసులు:
శొంటి - 1 చెంచా
నల్ల నువ్వులు - 1 చెంచా
బెల్లం - 1 చెంచా ఫ పాలు - కొద్దిగా
నీళ్లు - సరిపడా

తయారీ విధానం:
ఈ మూడింటినీ మెత్తగా నూరి, కల్కం అంటే పేస్ట్‌లా చేసుకోవాలి.
పేస్టుకు నీళ్లు జోడించి, పాలు కలుపుకోవాలి.
ఈ మిశ్రమంతో కషాయం తయారుచేసి, ఏడు రోజులపాటు రెండు పూటలా తీసుకోవాలి.
ఇలా చేస్తే సమస్య 90 శాతం దాకా తగ్గుతుంది. రెండు రోజుల్లోనే ఉపశమనంగా అనిపించినా 7 రోజుల దాకా కొనసాగించాలి.

నోటి పూతకు
నోటి పూతకు మందు త్రిఫల చూర్ణంలో ఉంది. ఇందుకోసం కషాయం తయారు చేసుకోవాలి.

కావలసిన దినుసులు:
త్రిఫల చూర్ణం - 2 చెంచాలు
మల్లె ఆకులు - గుప్పెడు
ఎండు ద్రాక్ష - గుప్పెడు
నీళ్లు - 1 గ్లాసు

తయారీ విధానం:
నీళ్లలో త్రిఫల చూర్ణం, మల్లె ఆకులు, ఎండు ద్రాక్ష వేసి మరిగించాలి.
కషాయం తయారయిన తర్వాత వెంటనే తాగకుండా, ముందు కొంత కషాయంతో నోరు పుక్కిలించాలి.
ఆ తర్వాత తాగాలి.

పచ్చ కామెర్లకు
కామెర్లు త్రిఫల కషాయంతో తగ్గుతాయి. ఇందుకోసం..

కావలసిన దినుసులు:
త్రిఫల చూర్ణం - 2 చెంచాలు
వేప బెరడు - కొద్దిగా
తిప్ప తీగ - కొద్దిగా
నీళ్లు - సరిపడా
తయారీ విధానం:
నీళ్లలో త్రిఫల చూర్ణం, తిప్ప తీగ, వేప బెరడు వేసి రాత్రంతా నానబెట్టాలి.
ఉదయం వేళ ఈ కషాయాన్ని వడగట్టి, కొద్దిగా తేనె కలుపుకుని తాగాలి.

రుతుక్రమం సక్రమం
కొందరికి రుతుక్రమం క్రమం తప్పుతుంది. స్రావంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇలాంటివాళ్లకు నువ్వుల కషాయం ఉంది.

కావలసిన దినుసులు:
నల్ల నువ్వుల పొడి - 2 చెంచాలు
నీళ్లు - 300 మిల్లీ లీటర్లు
బెల్లం - రుచికి సరిపడా

తయారీ విధానం:
నీళ్లలో నల్ల నువ్వుల పొడి వేసి ముప్పావు వంతు వచ్చేవరకూ మరిగించాలి.
ఈ నీళ్లలో బెల్లం కలిపి, వడగట్టి బహిష్టు మొదలయ్యేవరకూ రెండు పూటలా తాగాలి.
బహిష్టు వచ్చిన రోజుకు మూడు వారాల తర్వాత మళ్లీ అలాగే చేయాలి.
అలా మూడు నాలుగు మాసాల పాటు చేస్తే రుతుక్రమం చక్కబడుతుంది.

జలుబు, దగ్గు
శ్వాసపరమైన సమస్యలకూ కషాయాలున్నాయి. వాటిలో పిప్పళ్ల కషాయం మేలైనది.

కావలసిన దినుసులు:
శొంఠి - అర చెంచా
మిరియాలు - 1 చెంచా
పిప్పళ్లు - 1 చెంచా
నీళ్లు - సరిపడా

తయారీ విధానం:
నీళ్లలో పిప్పళ్లు, సొంఠి, మిరియాలు వేసి మరిగించి, చల్లార్చాలి.
ఈ కషాయాన్ని రెండు పూటలు తాగితే జలుబు, దగ్గు, ముక్కు దిబ్బెడ తగ్గుతాయి.

శరీర అంతర్భాగాల్లో పుండ్లు
నోటి నుంచి మలద్వారం వరకూ ఉండే శరీర అంతర్భాగాల్లో అల్సర్లకు అతిమధురం దివ్యౌషధం. ఈ కషాయం కోసం....

కావలసిన దినుసులు:
అతిమధురం - సరిపడా
పాలు - 50 మిల్లీ లీటర్లు
నీళ్లు - 400 మిల్లీ లీటర్లు

తయారీ విధానం:
నీళ్లలో పాలు, అతిమధురం కలిపి మరిగించాలి.
వడగట్టి సేవించాలి.
.
.
.

www.devullu.com
.
.


కషాయ నియమాలు ఇవే!
అందుబాటులో ఉన్నంత వరకు తాత్కాలిక సమస్యల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల దాకా వేటికైనా కషాయాలు వాడవచ్చు.
ఏ కషాయమైనా పరగడుపునే తీసుకోవాలనేది ఒక మౌలిక సూత్రం. అంటే, ఉదయం లేదా రాత్రి ఎప్పుడైనా భోజనానికి కనీసం అరగంట ముందు తీసుకోవాలి.
కషాయాల్లో కొన్ని రెండు మూడు రోజులు లేదా వారం మాత్రమే వాడుకునేవి ఉంటాయి. మరికొన్ని ఇతర కషాయాలు దీర్ఘకాలం పాటు వాడుకునేవిగా ఉంటాయి.
దీర్ఘకాలం పాటు వాడాల్సి ఉన్నప్పుడు వరుసగా 40 రోజులు తీసుకోవాలి. ఆ తర్వాత కూడా వాడాల్సి వస్తే, మధ్యలో ఓ 10 రోజుల పాటు మానేసి, ఆ తర్వాత మళ్లీ 40 రోజుల పాటు తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కాలం వాడాల్సి వచ్చినప్పుడు కూడా మధ్య మధ్యలో ఓ వారం 10 రోజులు గ్యాప్‌ ఇవ్వాలి. మధ్య మధ్య అలా ఆపకపోతే, శరీరం ఆ మందులకు బాగా అలవాటుపడిపోయి, ప్రతిస్పందించడం మానేస్తుంది.
కషాయాల్ని రెండు పూటలా తీసుకోవలసి ఉంటే రోజూ రెండుసార్లు తయారు చేసుకోవడం కష్టమే అవుతుంది. అలాంటి వారు, ఉదయమే రెండు పూటలకు సరిపడా తయారు చేసుకోవవచ్చు. ఉదయం అందులోంచి సగ భాగం తీసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగే యాలి. మిగతా సగభాగాన్ని ఆరేడు గంటల వ్యవధిలో అంటే సాయంత్రం తీసుకోవచ్చు. కాకపోతే, కషాయాన్ని గోరువెచ్చగా చేసుకుని తాగాలి. ఏ కషాయాన్నయినా చల్లగా ఎప్పుడూ తాగకూడదు.
కాస్త వెడల్పయిన పాత్రలో 500 మి.లీ. నీళ్లు తీసుకొని, నాలుగు చెంచాల పొడి కలిపి సన్నని మంటపైన ఉంచాలి. ఉడకబెట్టేటప్పుడు మూత తీసి ఉంచాలి. ఆ నీళ్లు నాలుగో వంతు మిగిలేదాకా మరిగించి చల్లార్చాలి. పల్చని వస్త్రంతో లేదా సన్నని టీ-ఫిల్టర్‌తోనూ వడబోయవచ్చు.

-డాక్టర్‌ డి. ప్రశాంత్‌ కుమార్‌
ఆయుర్వేద వైద్యులు
శక్తి ఆయుర్వేదిక్‌ సెంటర్‌,
మారేడ్‌పల్లి, హైదరాబాద్‌



ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

1 comment: