చతుర్వేదములు | Chathurvedamulu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

చతుర్వేదములు 
 Chaturvedamulu
Rs 144/-

⛧ వేదం అంటే ? ⛧
వేదాల్లో చాలా శాఖలు ఉన్నాయి. వాటి సంఖ్యలు 1131 శాఖలు అని చెబుతారు. స్తూలంగా వాటిని నాలుగు భాగాలుగా వేదవ్యాస భగవానుడు ఏర్పాటుచేసాడు. అంతకుముందు ఆయా లక్షణాలతో వేరే వేరే భాగాలుగా ఉండేవి. అందులో ఒక లక్షణమైన వాటిని ఋక్కులని, ఒక లక్షణం కల్గిన వాటిని మంత్రభాగం క్రింద యజస్సు అని, ఒక లక్షణం కల్గిన వాటిని గానాత్మకంగా సామం అని, మరికొన్నింటిని అధర్వణం అని ఇలా పేర్లతో ఆయా ఒక్కో భాగాన్ని ఒక్కో శిష్యుల ద్వారా పదిలపర్చడానికి వారికి అందించి, ఇక వారి ప్రశిష్యుల ద్వారా మరిన్ని ఉప శాఖలుగా విభజించి వాటి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసినట్టుగా మన శ్రీమద్ భాగవతాది గ్రంథాలు తెలియజేస్తున్నాయి.

మొదట ఈ నాలుగు వేద రాశులని ఒక్కో వ్యక్తి అధ్యయనం చేసే స్థితి ఉండేదేమో, కానీ వేదవ్యాసుని సమయానికే కొంత సందేహం ఏర్పడి రానున్న కాలంలో ఈ మాత్రం నిలబెట్టుకొనే సామర్థ్యం మనుష్యులలో ఉండకపోవచ్చుననేమో ఆయన తన శిష్యుల ద్వారా వాటిని పరిరక్షించే వ్యవస్థ ఏర్పాటు చేసి ఉంటాడు. సూర్యోదయం చాలా మెల్లగా ఉంటుంది, అదే సూర్యాస్తమయం చాలా వేగంగా ఉంటుంది. అలాగే మనుష్యులలో ధార్మిక ప్రవృత్తి అనేది ఎంత వేగంగా దిగజారుతుందో మనకు తెలుస్తుంది. ఆధునిక వైజ్ఞానిక ప్రవృత్తులు సమాజాన్ని ఎంత త్వరగా దిగజార్చాయి అనేది కూడా గమనించవచ్చు.

ఆధునిక వైజ్ఞాన శాస్త్రం పెరిగింది 16 వ శతాబ్దం నుండే, అయితే దాని వల్ల మంచి జరిగింది కానీ ఎన్నో వేల సంవత్సరాల నుండి వస్తున్న ప్రకృతి చిన్నా భిన్నం అవడంకూడా అప్పటి నుండే మొదలైంది. అయితే వ్యవస్థ చిన్నా భిన్నం అవడం ఎంత త్వరగా జరుగునో మనకు దీన్ని గమనిస్తే తెలుస్తుంది.

అయితే ఈ వేదం అంతా ఒకే రాశి క్రింద ఉండేది, ఒక వ్యక్తి అంతటినీ అధ్యయనం చేయగలిగే వారని మనకు రామాయణంలో తెలుస్తుంది. రాముడు మొదటిసారిగా హనుమను కలిసినప్పుడు, హనుమ రామున్ని కొన్ని ప్రశ్నలు వేసాడు, ఇది పది పదిహేను శ్లోకాలుగా రామాయణంలో ఉంది. ఆ ప్రశ్నలకు బదులుగా రాముడు లక్ష్మణ స్వామితో హనుమ గూర్చి ఇలా అన్నాడు “నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామవేద విజుషః శక్యమేవం ప్రభాశితుం” ఈయన మాట్లాడే మాటలు ఎంత బాగున్నాయి చూసావా, చంపివేద్దాం అని వచ్చినవాడికి కూడా ఈయన మాటలు వింటే కత్తి దించివేస్తాడు, ఆ సామర్థ్యం ఈయన మాటల్లో కనిపిస్తుంది. ఋగ్వేదపు, యజుర్వేదపు, సామవేదపు నియంత్రణ కచ్చిత్తంగా కనిపిస్తుంది. అంటే ఆవేదాధ్యయనం చేసినవ్యక్తిలో ఏర్పడే పూర్ణత ఈయనలో కనిపిస్తుంది. ఆంటే ఆ కాలంలో మొత్తం వేద రాశిని నేర్చేసామర్థ్యం ఉండేదని మనకు కనిపిస్తుంది.

అయితే ఆ యుగాలు గడిచి ఎన్నో మార్పులు ఏర్పడ్డాయి అందుకే వేదవ్యాసుడు ఆ మొత్తం వేద రాశిని కొన్ని శాఖలుగా విభజించవలసి వచ్చింది. అవి మొత్తం 1131 శాఖలు అని చెబుతారు. అందులో సామవేదానికే 1000 శాఖలు, యజుర్వేదానికి 101 శాఖలు, అదర్వవేదానికి 9 శాఖలు, ఋగ్వేదానికి 21 శాఖ అని అంటారు. అలా శాఖలుగా చేసి వేద విజ్ఞాన పరిరక్షణ చేసారు. మన కాలం దాకా వచ్చే సరికి అందులో కేవలం 11 శాఖలు మాత్రమే కనిపిస్తున్నాయి. 1000 శాఖలు కల సామవేదంలో కేవలం 4 శాఖలు మాత్రమే కనిపిస్తున్నాయి, యజుర్వేదంలో 101 కి బదులు 4 శాఖలు, ఇక అధర్వవేదంలో 2, ఋగ్వేదంలో 1 శాఖ మాత్రమే ఈనాడు మనకు కనిపిస్తున్నాయి. మిగతా శాఖల పేర్లు మాత్రం తెలుస్తున్నాయి కాని ఆ శాఖలు ఏమిటో ఎవ్వరికీ తెలియదు.

వేదం అనేది విజ్ఞాన శాస్త్రం. కొంత తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. మను అనే మహర్షి వేదాన్ని గురించి ఇలా చెప్పాడు.

“వేద శబ్దేభ్య ఏవాతౌ దేవా దీనం చకార సహ”

సహ- ఈ జగత్తుని సృజించినవాడెవడో జగత్ కారణమైనటువంటి వాడొకడున్నాడు. ఈ విషయం అందరూ అగీకరించాల్సి ఉంటుంది.

ఎందుకంటే “For Every Effect there must be some Cause“. మనం ఇప్పుడు చూస్తున్న ఈ జగత్తు అంతటికీ ఒక కారణం అనేది ఉండాల్సిందే. దాన్నే మనం కారణ తత్వం అందాం. ఈ జగత్తులో ఎన్నో విషయాలు చూస్తున్నాం, ఇవన్నీ ఒకదాని తో ఒకటి ముడి పడి ఉన్నాయి.

ఆ కారణ తత్వం వీటన్నింటినీ నడుపుతుంది. మన పెద్దలు “కారణంతు ధ్యేయః” ఆ కారణాన్ని తత్వాన్ని తెలుసుకోండి అని చెబుతారు. ఆ తత్వం ఎక్కడో ఒక చోట ఉంటుంది అని చెప్పనవసరం లేదు. ఎందు కంటే మనం చూసే ప్రతి అణువణువు ఎంత క్రమబద్దమై ఉంటుంది కావున అది అంతటా వ్యాపించియే ఉంటుంది. ఇంతటినీ తయారు చేసిన ఆ కారణ తత్వం చాలా శక్తివంతమైనది, అన్నింటినీ నియంత్రించ గలదై ఉండాల్సిందే లేకుంటే దీన్నంతా ఆధీనంలో పెట్టుకోవడం అంత సులువుకాదు.

నియంత్రించడం అనేది పురుష స్వభావం అయితే ఇక దయ, క్షమ, ఓరిమి, జాలి ఇవన్నీ స్త్రీ స్వభావం అని అనుకోవచ్చు. “చకార” అతను చేసెను, అందుకే ఆయనలోని ఈ నియంత్రించే స్వభావన్ని బట్టి మను అనే మహర్షి “సహ” అంటే అతడు అని వ్యవహరిస్తాడు.

మరి కేవలం నియంత్రించే తత్వమే ఆ జగత్ కారణ తత్వానికి ఉంటే ప్రమాదం కదా, ఎవ్వరూ దాని దరికి చేరటానికి ఇష్ట పడరు. అందుకే ఆ కారణ తత్వం మొత్తం దయచే ఆక్రమించబడి నిరంతరం ఉంటుంది. వేద భాగమైన మంత్ర పుష్పాల్లో ఈ విషయం చెప్పబడి ఉంది. “నీలతో యదమధ్యస్తాః విధ్యుల్లేఖేవ భాస్వరః” దయా అనే గుణం ఆయనలో ఒక మేఘాన్ని ఆక్రమించిన మెరుపు తీగవలె, ఆ తత్వాన్ని కప్పబడి ఉంటుంది అని తెలుపుతుంది. అయితే దయ అనేది స్త్రీ స్వభావం అవటంచే స్త్రీ రూపంలో భావన చేస్తుంటారు. అయితే ఈ నియంతృత్వం లేక శాసితృత్వం మరియూ దయ లో ఏ ఒక్కటీ లేక పోతే పని చెయ్యదు. కేవలం శాసితృత్వం ఉన్నా సరిపోదు, కేవలం దయ ఉన్నా సరిపోదు. అందుకే మన పెద్దలు ఇవి రెండు వేరువేరుగా ఉండవయా, దయ కల్గిన నియంత్రణ ఉన్న వాడే ఈ జగత్ కారణ తత్వం అని చెబుతారు. వాడు అని చెబుతున్నాం ఎందుకంటే ఆ తత్వం చేతనుడై ఉండాలి, మనకు తెలివి ఉంది మనలాంటి వారిని నియంత్రించే వాడికీ తెలివి ఉంటే తప్ప నియంత్రించడం కుదరదు. అందుకే చేతనుడై ఉండాలి ఆ తత్వం. దయ కల్గి నియంత్రించగలిగేదే ఆ తత్వం “ఏకమేవ అద్వితీయం”అని చాందోగ్య అనే శృతి తెలియజేస్తుంది. ఈ దయ నియంతృత్వం రెంటినీ కల్పి మనం శ్రీమన్నారాయణుడు అని చెబుతాం, అంటే ‘శ్రీ’ కలిగిన ‘నారాయణుడు’ అని అర్థం.

“చకార” ఈ జగత్తంతా చాతుర్వర్ణం. చాతుర్వర్ణం అంటే నాలుగు వర్ణాలుగా చెప్పటానికి యోగ్యత కలిగి ఉన్నది. నిలువుగా క్రమ పద్ధతిలో నడిచే మానవులం ఒక వర్ణం అయితే, అడ్డంగా నడిచే పశువులూ, పక్షులూ మరియూ క్రిమి కీటాదులు తిర్యక్ అనే ఒక వర్ణం. ప్రాణం ఉన్నా లేకున్నా ఒక వద్ద కదలక పడి ఉండే చెట్లు, రాల్లు ఇవన్నీ స్తావరాలు ఇవి ఒక వర్ణం.

ఇవన్నీ ఇలా పనిచేస్తున్నాయి అంటే వెనకాతల కొన్ని ధివ్యమైన శక్తివిశేషాలు మన బుద్దికి అందనివి కొన్ని ఉన్నాయి. ప్రమిద మనం తేగలం అందులో నెయ్యి పొయ్యగలం, ఇక దూదితో వత్తు పెట్టగలం, ఇక అగ్గిపెట్టెతో అగ్గి పుల్లని గీసి దీపం వెలిగిస్తున్నాం. మరి అది దేనిలోంచి వచ్చింది అని చెప్పాలి. ఆ వచ్చే వేడి లేక కాంతి వీటన్నింటికన్నా విలక్షణమైన శక్తివిశేషం కలది. దానికి దివ్యం లేక దేవ లేక సుర అని ఒక వర్ణం గా చెబుతారు. సుర నర తిర్యక్ స్తావర జాతులనే చాతుర్వర్ణం అని అంటారు.

సహ చకార - ఈ నాలుగు వర్ణాలను చేసిన వాడు, దేని చేత ?

“వేద శబ్దేభ్య ఏవ” వేద శబ్దంల చే చేసెను అని చెబుతుంది.

ఆ వేద శబ్దం కు అంత శక్తి ఉంది అన్న మాట. ఈ సృష్టి అంతా ఆ వేద శబ్దంచే సృజించబడి ఉంది.

అది విని నేర్వాల్సిందే తప్ప చదివి నేర్చేది కాదు. వేదం అనేది ఒక భాషకు కూడ అందనిది. ఎందుకంటే భాషలనేవి మనుష్యులు అవసరంకోసం ఏర్పర్చుకున్నవి. వేద శబ్దాల్లోంచి సంస్కరించబడి ఉన్న భాష సంసృతం అవడంచే ఆ భాషలో మనకు వేదం కనిపిస్తుంది. భాషలు, అక్షరాలు ఇవన్నీ ఏర్పడక ముందే శబ్దం అనేది ఉంది. వేదాలు అనేవి ఒకరు ఏర్పర్చిన శబ్దం కాదు. సహజ శబ్దాలను మనం వేదాలు అని అంటాం. ఏర్పాటుచేసుకున్న శబ్దాలని మనం భాషలు అంటాం. అయితే వేదాన్ని సహజ శబ్దం అని ఎలా అనగలం అంటే, ఆ శబ్దాలలో ఇమిడి ఉన్న ఆ విధానం అనేది మన భాషా ప్రావిణ్యానికి అందనిదిలా కనిపిస్తుంది కాబట్టి.

ఈ ప్రకృతిలో ఇంత విశ్వం తయారుకావడానికి కారణమైన వేద శబ్దాలను మన ఋషులు తపస్సమాధి దశలో వాటిని గుర్తించారు. వాటిని తమ శిష్యులకు అందించారు. అయితే ఇది శ్రవణ పరంపర. ఉచ్చారణ- అణుచ్చారణ క్రమంగా వేదాధ్యయనం సాగేది. అది విని నేర్చేది కనక శృతి అని పేరుపెట్టారు.

పదే పదే ధ్యానించేది కనక ఆమ్నాయము అని అంటారు.

భగవంతునికి కూడా అది ఎప్పటిదో తెలియదు కనక దాన్ని నిత్యం అని పేరు పెట్టారు.

అయితే దాన్ని తెలుసుకుంటే మనకు ఏమడిగితే దాన్ని ఇస్తుంది, తెలిపేది మరియూ కావల్సిన లాభాన్ని ఇచ్చేది కనకవేదం అని పేరు పెట్టారు.

ఎవ్వరూ వ్రాయనిది కనక అపౌరుషేయం అని పేరు. ప్రతి ప్రాణి పురుష విభాగంలోకే చెందుతుంది, ఇక పరమాత్మ కూడా ఉత్తమ పురుషుడు, అంటే ఒక పురుష విభాగంలోకే చెందుతాడు. అందుకే అయన రాసింది కూడా కాదు వేదం.

ఎవ్వరూ చెప్పినది కాదు వేదం. మరి ఏమిటి వేదం ? “యస్య విశ్వసితం వేదాః” వేదాలు ఆయనకి ఊపిరి అని చెప్పారు. అయన నిర్ణయించింది కూడా కాదు. ఆయన అనుభవించ కలడు. అవి ఒక పుస్తకం కాదు అని గుర్తించాలి.

వేద శబ్దాన్ని తీసుకొని దీనికి ఇది ఇంత అర్థం అని చెప్పలేం. జన్మ నిచ్చే తల్లిని మనం అమ్మ అని పిలుస్తాం, మరొక భాషలో మా అని, తాయార్ అని ఇలా వివిద శబ్దాలతో పిలుస్తారు. అయితే ఆ వ్యక్తిని చెప్పడానికి ఇన్ని శబ్దాలు ఆ అమ్మని చెప్పటానికే ఏర్పడ్డవి, కానీ ఈ శబ్దాలకి అర్థం అమ్మ అవుతుందా? అమ్మని పూర్తిగా ఈ శబ్దం చెప్పగలదా ? శబ్దం అనేది అనిత్యం, ఇప్పుడు ఉంటుంది, కొంత సమయానికి ఉండదు. ఆయితే ఆ అమ్మ ఎప్పటికి అక్కడ నిలిచి ఉంది. అమ్మలో మార్పు లేదు. ఆ శబ్దంలో కనిపించని ప్రేమ,వాత్సల్యం అనే గుణాలు ఆ అమ్మలో కనిపిస్తున్నాయి. కనుక శబ్దం అనేది చాలా తక్కువ, దాని అర్థం చాల ఎక్కువ. అందుకే వేద శబ్దానికి ఇది అర్థం అని చెప్పడం కష్టం. అలా చెప్పడం సముద్రాన్ని చిన్న పాత్రలో నింపే ప్రయత్నం చేసినట్లే అవుతుంది.



అయితే ఈ వేదాలతోనే ఇంత సృష్టి జరిగింది కనక సృష్టికి ప్రతి సృష్టి చేయగలగొచ్చు అనడానికి విశ్వామిత్రుడే ఉదాహరణ.మన జన్మకి ప్రవృత్తికి కారణం వేదమే, కేవలం మనమే కాదు ఈ విశ్వం అంతటికీ కారణం వేదమే, తల్లిని ఎట్లా అయితే పూజిస్తామో, కృతజ్ఞత కల్గి ఉంటామో ఆ వేదానికీ మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ వేదం పురాణాల ద్వారా, స్మృతుల ద్వారా ఇలా వివిధ రకాలుగా అందవచ్చు కనక వాటిని గూర్చి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం, కానీ అది ఇంతే అని అర్థం కట్టలేం. మన అదృష్టం మనం ఆ సంప్రదాయంలో ఉన్నాం. వాటిని మనం పరిరక్షించుకుందాం.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment