శ్రీ మణిద్వీపవర్ణన
Sri Manidweepa Varnana
Rs.12/-
శ్రీదేవీ భాగవతంలో మణిద్వీప వర్ణన ఉంది
(12వ స్కందంలో 10 - 12 అధ్యాయములు)
శ్రీమాత నివాసం చింతామణి గృహం
విజయదశమి పర్వదిన శుభవేళ ఆ జగజ్జనని, శివాత్మక మణిద్వీప నివాసినీ అయిన ఆ
తల్లిని స్మరించుకోవటం ఎంతో శుభప్రదం. ఆ అమ్మ మణిద్వీపంలో ఎలా
అలరారుతోంది అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణించి చెప్పే కథ
దేవీభాగవతంలో వర్ణితమై ఉంది. నూతన గృహప్రవేశ శుభ సందర్భాలలో తరతరాలుగా
మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఉండటం ఓ ఆచారంగా వస్తోంది.
పరదేవత అయిన ఆ శ్రీమాత ప్రపంచాన్నంతటనీ పరిరక్షిస్తుంది. ఆమె నిత్యం
నివసించే గృహమే చింతామణి గృహం. అది మణిద్వీపంలో ఉంటుంది.
సర్వలోకోత్తమోత్తమైన ఆ మణిద్వీపాన్ని స్మరిస్తే చాలు సర్వపాపాలూ
నశిస్తాయని దేవీభాగవతం పన్నెండో స్కంధం వివరిస్తోంది. దుష్టశిక్షణ,
శిష్టరక్షణ చేస్తూ జగత్తునంతటినీ పాలించే ఈ భువనేశ్వరీ మాత నివసించే
చింతామణి గృహం వేయిస్తంభాల మండపాలతో విరాజిల్లుతుంటుంది. ఇలాంటి మండపాలు
నాలుగుంటాయి. శృంగార మండపం, ముక్తిమండపం, జ్ఞానమండపం, ఏకాంత మండపం అని
వాటికి పేర్లు. కోటి సూర్యప్రభలతో అవి నిత్యం ప్రకాశిస్తుంటాయి.
వాటిచుట్టూ కాశ్మీరం, మల్లికా, కుందవనాలు అలరారుతుంటాయి. ఆ వనాలలో
కస్తూరి మృగాలు సంచరిస్తూ పరిమళాలను ప్రసరింపజేస్తుంటాయి. అక్కడే
సుధారసపూర్ణంగా ఉండే ఒక పెద్దసరోవరం ఉంటుంది. ఆ సరోవరం అంచులు,
సోపానాలన్నీ అనేకానేక మణులు, రత్నాలతో పొదిగి ఉండి మనోహరంగా ఉంటాయి. ఆ
సరోవరం మధ్యలో ఓ మహాపద్మవనం, హంసల్లాంటి పక్షులు ఎంతో ముచ్చటగొలుపుతూ
ఉంటాయి. చింతామణి గృహంలో పదిమెట్లతో ఉన్న ఓ వేదిక ఉంటుంది. ఆ వేదికకు
ఉన్న పదిమెట్లూ పది శక్తిస్వరూపాలు. దానికి ఉండే నాలుగు కోళ్లపై ఉండే
ఫలకమే సదాశివుడు. ఆ ఫలకం మీద మాత భువనేశ్వరుడి వామాంకంలో కూర్చొని
ఉంటుంది. ఆ మాతకు రత్నాలు పొదిగిన వడ్డాణం, వైఢూర్యాలు తాపడం చేసిన
అంగదాలు అలరారుతుంటాయి. శ్రీచక్రరూపంలో ఉన్న తాటంకాలతో శ్రీమాత ముఖపద్మం
కళకళలాడుతుంటుంది. చంద్రరేఖను మించిన అందంతో ఉండే నొసలు, దొండపండ్లలా
ఉండే పెదవులు, కస్తూరి కుంకమ, తిలకం దిద్ది ఉన్న నుదురు, దివ్యమైన
చూడామణి, ఉదయభాస్కర బింబంలాంటి ముక్కుపుడక ఇలా ఎన్నెన్నో దివ్యాభరణాలు,
మైపూతతో శ్రీమాత అలరారుతుంటుంది. ఆ మాతకు పక్కభాగంలో శంఖ, పద్మ నిధులు
ఉంటాయి. వాటి నుంచి నవరత్న, కాంచన, సప్తధాతు వాహినులు అనే నదులు పరవళ్లు
తొక్కుతూ అమృత సంద్రంలోకి చేరుతుంటాయి. జగజ్జనని భువనేశ్వరుడి పక్కన
ఉన్నది కాబట్టే ఆయనకంతటి మహాభాగ్యం, శక్తియుక్తులు లభించాయని అంటారు. మాత
నివసించే చింతామణి గృహం వెయ్యి యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ గృహానికి
ఉత్తరంగా అనేకానేక శాలలు ఒకదానిని మించి మరొకటి ఉంటాయి. ఇవన్నీ ఆ అమ్మ
శక్తిప్రభావంతో అంతరిక్షంలో ఏ ఆధారమూ లేకుండా వేలాడుతుంటాయి. ప్రతి
బ్రహ్మాండంలోనూ ఉండే దేవ, నాగ, మనుష్య జాతులకు చెందిన దేవీ ఉపాసకులంతా
చేరేది ఈ చింతామణి గృహానికే. కరుణారస దృక్కులతో ఆమె తన బిడ్డల వంక చూస్తూ
ఉంటుంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమన్వితంగా ఆ మాత కన్పిస్తుంటుంది.
ఆమె చుట్టూ లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ,
స్మృతి, లక్ష్మీ అనే దేవాంగనలు ఉంటారు. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య,
విలాసిని, అఘోర, మంగళ, దోగ్ద్రి అనే తొమ్మిది పీఠాశక్తులు జగన్మాతను
నిరంతరం సేవిస్తూ ఉండటం కన్పిస్తుంది. కేవలం దేవి ఉపాసకులకేకాక
నిరంతరార్చన తత్పరులకు ఇక్కడే స్థానం దొరుకుతుంది. ఈ ప్రదేశంలో మరో గొప్ప
తనమేమిటంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ద్రాక్ష, నేరేడు, మామిడి,
చెరకురసాల జీవనదులు ప్రవహిస్తుంటాయి. కోర్కెలను తీర్చే మహత్తర వృక్షాలు
ఇక్కడ ఎన్నెన్నో. ఈ ప్రాంతంలో ఉండేవారికి కామ క్రోధ లోభ మోహ మద
మాత్సర్యాలుండవు. అంతా నిత్యయౌవనంతో ఆనందంతో ప్రకాశిస్తుంటారు. వారంతా
భువనేశ్వరీ మాతను నిరంతరం భజిస్తూ ఉంటారు. దేవతలంతా ఇక్కడికి వచ్చి
అమ్మవారికి నిత్యం సేవలు చేస్తూ ఉంటారు. అమ్మ నివసించే మణిద్వీపమూ
అందులోని చింతామణి గృహమూ ఒక్కోసారి ఒక్కో విధంగా పవిత్రకాంతులను
వెదజల్లుతూ ఉంటాయి. ఐశ్వర్యానికీ, యోగానికీ అన్నిటికి అది పరమావధి.
జగత్తునంతటినీ తానై యుగయుగాలుగా పాలిస్తున్న ఆ జగన్మాత చిద్విలాసం
దేవీభాగవతంలో ఇలా కన్పిస్తుంది. తన భక్తులకు బాధ కలిగిందని
తెలిసినప్పుడల్లా తానే స్వయంగా ముందుకువచ్చి దుష్ట శిక్షణ చేస్తుండే ఆ
పరాంబిక ఎక్కడుంటుంది అని ఎవరికైనా కలిగే సందేహమే. ఆ సందేహానికి
సమాధానమిస్తూ మణిద్వీపంలో ఉండే చింతామణి గృహంలో ఉండే ఆ శ్రీమాత గురించి ఈ
కథా సందర్భం ఇలా వివరించి చెప్పింది. మణిద్వీప వర్ణన, చింతామణి
గృహవర్ణనలు వింటేనే సకల పాపాలూ నశిస్తాయని భక్తకోటి నమ్మకం.
- డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు
--------------------------------------------
Manidveepavarnanaa
శ్రీ మాత్రేనమః
మణిద్వీప వర్ణన
మణిద్వీపం బ్రహ్మలోకానికి పైన ఉంతుంది. దీనిని సర్వలోకమని కూడా అంటారు. మణిద్వీపం కైలాసం, వైకుంఠం, గోలోకం కంటే శ్రేష్ఠంగా విరాజిలుతూంటుంది. మణిద్వీపానికి నాలుగు వైపులా అమృత సముద్రము విస్తరించి ఉంటుంది. ఆ సముద్రంలో శీతల తరంగాలు, రత్నాలతో కూడిన సైకత ప్రదేశాలు, శంఖాలు అనేక వర్ణాలు గల జలచరాలు కన్నులు పండుగ చేస్తూంటాయి. ఆప్రదేశానికి అవతల ఏడుయోజనాల వైశాల్యం గల లోహమయ ప్రాకారం ఉంటుంది. నానా శస్త్రాస్త్రాలు ధరించిన రక్షకభటులు కాపలా కాస్తుంటారు. ప్రతి ద్వారంలోను వందలాది మంది భటులు ఉంటారు. అక్కడ శ్రీఅమ్మవారి భక్తులు నివసిస్తూంటారు. అడుగడుక్కీ స్వచ్చమైన మధుర జల సరోవరాలు, ఉద్యానవనాలు ఉంటాయి. అవి దాటి వెళితే కంచుతో నిర్మించిన మహాప్రాకారం ఉంటుంది. సమస్త వృక్ష జాతులు అక్కడ ఉంటాయి. అనేక వందల సంఖ్యలలో దిగుడు బావులు, నదీ తీర ప్రదేశాలు అక్కడ కన్నుల పండువుగా ఉంటాయి. అనేక జాతులు పక్షులు, అక్కడ వృక్షాలపైన నివసిస్తూంటాయి.
1⃣
ఆ ప్రాకారం దాటగా తామ్రప్రాకారం ఉంది. అది చతురస్రాకారంగా ఉంటుంది. అక్కడ పుష్పాలు బంగారు వన్నెతో భాసిల్లుతూంటాయి. పండ్లు రత్నాలవలె కన్నుల కింపుగా ఉంటూ సువాసనలు వెదజల్లుతుంటాయి. తామ్ర ప్రాకారం దాటి వెళ్ళగా సీసప్రాకారం ఉంటుంది. సీస ప్రాకారాల మధ్య భాగంలో సంతాన వాటిక ఉంది. అక్కడ అనేక రకాల ఫలవృక్షాలు ఉంటాయి. అక్కద లెక్కలేనన్ని అమర సిద్ధగణాలు ఉంటాయి. సీస ప్రాకారాన్ని దాటి పురోగమించగా ఇత్తడి ప్రాకారం ఉంటుంది. సీస, ఇత్తడి ప్రాకారాల మధ్య భాగంలో హరిచందన తరువనాలు ఉన్నాయి. ఈ ప్రదేశమంతా నవపల్లవ తరు పంక్తులతో లేలేత తీగలతో, పచ్చని పైరులతో కనులవిందుగా ఉంటుంది. అక్కడి నదీనదాలు వేగంగా ప్రవహిస్తుంటాయి.
2⃣
ఆ ఇత్తడి ప్రాకారం దాటగా పంచలోహమయ ప్రాకారం ఉంటుంది. ఇత్తడి పంచలోహమయ ప్రాకారాల మధ్యలో మందార వనాలు, చక్కని పుష్పాలతో నయనానందకరంగా ఉంటాయి. ఆ పంచలోహ ప్రాకారం దాటి ముందుకు వెళ్ళగా, మహోన్నత శిఖరాలతో రజత ప్రాకారం ఉంది. అక్కడ పారిజాత పుష్పాలు సుగంధాలు వెదజల్లుతుంటాయి.
3⃣
ఆ ప్రాకారం దాటి వెళ్ళగా సువర్ణమయ ప్రాకారం తేజరిల్లుతుంది. రజత, సువర్ణమయ ప్రాకారాల మధ్య కదంబవనం ఉంది. ఆ చెట్ల నుండి కదంబ మద్యం ధారగా ప్రవహిస్తుంటుంది. దానిని పానము చేయడం వలన ఆత్మానందం కలుగుతుంది.
4⃣
సువర్ణమయ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా ఎర్రటి కుంకుమ వర్ణంగల పుష్యరాగమణి ఉంటుంది. సువర్ణమయ, పుష్యరాగ ప్రాకారాల మధ్య వృక్షాలు, వనాలు, పక్షులు అన్ని రత్నమయాలై ఉంటాయి. ఇక్కడ దిక్పతులైన ఇంద్రాదులు ఆయుధాలు ధరించి ప్రకాశిస్తుంటారు. దానికి తూర్పుగా అమరావతీ నగరం నానావిధ వనాలతో భాసిల్లుతూంతుంది. అక్కడ మహేద్రుడు వజ్రహస్తుడై దేవసేనతో కూడి ఉంటాడు. దానికి ఆగ్నేయభాగంలో అగ్నిపురం ఉంటుంది. దక్షిణ భాగంలో యముని నగరం సమ్యమిని ఉంది. నైరుతీ దిశలో కృష్ణాంగన నగరంలో రాక్షసులు ఉంటారు. పశ్చిమదిశలో వరుణ దేవుడు శ్రద్ధావతి పట్టణంలో పాశధరుడై ఉంటాడు. వాయువ్యదిశలో గంధవతిలో వాయుదేవుడు నివసిస్తూంటాడు. ఉత్తరదిశలో కుబేరుడు తన యక్షసేనలతో, అలకాపురి విశేష సంపదతో తేజరిల్లుతూంటుంది. ఈశాన్యంలో మహారుద్రుడు అనేకమంది రుద్రులతోనూ, మాతలతోనూ, వీరభద్రాదులతోనూ యశోవతిలో భాసిల్లుతూంటాడు.
5⃣
పుష్యరాగమణుల ప్రాకారం దాటి వెళ్లగా అరుణవర్ణంతో పద్మరాగమణి ప్రాకారం ఉంటుంది. దానికి గోపుర ద్వారాలు అసంఖ్యాక మండపాలు ఉన్నాయి. వాటి మధ్య మహావీరులున్నారు. చతుస్షష్టి కళలు ఉన్నాయి. వారికి ప్రత్యేక లోకాలు ఉన్నాయి. అనేక వందల అక్షౌహిణీ సైన్యాలు ఉన్నాయి. రధాశ్వగజ శస్త్రాదులు లెక్కకు మించి ఉన్నాయి. ఆ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా గోమేధిక మణి ప్రాకారం ఉంటుంది. జపాకుసుమ సన్నిభంగా కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. అక్కడి భవనాలు గోమేధిక మణికాంతులను ప్రసరింపచేస్తూంటాయి. అక్కడ 32 శ్రీదేవీ శక్తులు ఉంటాయి. 32లోకాలు ఉన్నాయి. ఆ లోకంలో నివసించే శక్తులు పిశాచవదనాలతో ఉంటాయి. వారందరూ శ్రీఅమ్మవారి కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులై ఉంటారు. గోమేధిక ప్రాకారం దాటి వెళ్తే వజ్రాల ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీత్రిభువనేశ్వరీదేవి దాసదాసీ జనంతో నివసిస్తూంటారు.
6⃣
వజ్రాల ప్రాకారం దాటి వెళ్ళగా వైడూర్య ప్రాకారం ఉంటుంది. అక్కడ 8దిక్కులలో బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అనువారలు సప్త మాతృకలుగా ఖ్యాతి చెందారు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టమ మాతృకగా పిలువబడుతూ ఉంది.ఈ వైడూర్య ప్రాకారాన్ని దాటి వెళ్ళగా, ఇంద్రనీలమణి ప్రాకారం ఉంటుంది. అక్కడ షోడశ శక్తులు ఉంటాయి. ప్రపంచ వార్తలు తెలియచేస్తూంటాయి.
7⃣
ఇంకా ముందుకు వెళ్ళగా మరకత మణి ప్రాకారం తేజరిల్లుతూంటుంది. అక్కడ తూర్పుకోణంలో గాయత్రి, బ్రహ్మదేవుడు ఉంటారు. నైరుతికోణంలో మహారుద్రుడు, శ్రీగౌరి విరాజిల్లూతు ఉంతారు. వాయువ్యాగ్ని కోణంలో ధనపతి కుబేరుడు ప్రకాశిస్తూంటారు. పశ్చిమకోణంలో మన్మధుడు రతీదేవితో విలసిల్లుతూంటారు. ఈశాన్యకోణంలో విఘ్నేశ్వరుడు ఉంటారు. వీరందరు అమ్మవారిని సేవిస్తూంటారు.
8⃣
ఇంకా ముందుకు వెళ్ళగా పగడాల ప్రాకారం ఉంటుంది. అక్కద పంచభూతాల స్వామినులు ఉంటారు. పగడాల ప్రాకారాన్ని దాటి వెళ్ళగా నవరత్న ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీదేవి యొక్క మహావతారాలు, పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, కపాలభైరవి, క్రోధభువనేశ్వరి, త్రిపుట, అశ్వారూఢ, నిత్యక్లిన్న, అన్నపూర్ణ, త్వరిత, కాళి, తార, షోడశిభైరివి, మాతంగి మొదలైన దశ మహావిద్యలు ప్రకాశిస్తూంటాయి.
🔟
నవరత్న ప్రాకారం దాటి ముందుకు వెళ్తే, మహోజ్వల కాంతులను విరజిమ్ముతూ చింతామణి గృహం ఉంటుంది.
చింతామణి గృహానికి వేయి స్తంబాలు, శృంగార, ముక్తి, ఙ్ఞాన, ఏకాంత అనే నాలుగు మండపాలు ఉన్నాయి. అనేక మణి వేదికలు ఉన్నాయి. వాతావరణం సువాసనలు వెదజల్లుతూంటుంది. ఆ మండపాలు నాలుగు దిక్కులా కాష్మీరవనాలు కనులకింపుగా ఉంటాయి. మల్లె పూదోటలు, కుంద పుష్పవనాలతో ఆ ప్రాంతమంతా సువాసనలు ఉంటుంది. అక్కడ అసంఖ్యాక మృగాలు మదాన్ని స్రవింపచేస్తాయి. అక్కడగల మహాపద్మాల నుండి అమృత ప్రాయమైన మధువులను భ్రమరాలు గ్రోలుతూంటాయి. శృంగార మండపం మధ్యలో దేవతలు శ్రవణానందకర స్వరాలతో దివ్యగీతాలను ఆలపిస్తూంటారు. సభాసదులైన అమరులు మధ్య శ్రీలలితాదేవి సింహాసనుపై ఆసీనురాలై ఉంటుంది.
శ్రీదేవి ముక్తి మండపంలో నుండి పరమ భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఙ్ఞాన మండపంలో నుండి ఙ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏకాంత మండపంలో తన మంత్రిణులతో కొలువైయుంటుంది. విశ్వరక్షణను గూర్చి చర్చిస్తుంటుంది. చింతామణి గృహంలో శక్తితత్త్వాత్మికాలైన పది సోపానాలతో దివ్య ప్రభలను వెదజిల్లుతూ ఒక మంచం ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు దానికి నాలుగు కోళ్ళుగా అమరి ఉంటారు. ఆ నాలుగు కోళ్ళపై ఫలకంగా సదాశివుడు ఉంటాడు. దానిపై కోటి సూర్యప్రభలతో, కోటి చంద్ర శీతలత్వంతో వెలుగొందుతున్న కామేశ్వరునకు ఎడమవైపున శ్రీఅమ్మవారు ఆసీనులై ఉంటారు.
శ్రీలలితాదేవి ఙ్ఞానమనే అగ్నిగుండం నుండి పుట్టినది
నాలుగు బాహువులు కలిగి, అనురాగమను పాశము,
క్రోధమనే అంకుశము, మనస్సే విల్లుగా, స్పర్శ, శబ్ద, రూప,
రస, గంధాలను (పంచతన్మాత్రలను) బాణాలుగా కలిగి ఉంటుంది.
బ్రహ్మాండమంతా తన ఎర్రని కాంతితో నింపివేసింది. సంపెంగ, అశోక, పున్నాగ మొదలగు పుష్పముల సువాసనలతో తలకట్టు కలిగినది. కురవిందమణులచే ప్రకాసించబడుతున్న కిరీటముచే అలంకరించబడినది. అమ్మవారి నుదురు అష్టమినాటి చంద్రునివలె ప్రకాశితూంటుంది. చంద్రునిలోని మచ్చవలె ఆమె ముఖముపై కస్తూరి తిలకం దిద్దుకుని ఉంటుంది. ఆమె కనుబొమ్మలు గృహమునకు అలంకరించిన మంగళ తోరణములవలె ఉన్నవి. ప్రవాహమునకు కదులుచున్న చేపలవంటి కనులు, సంపెంగ మొగ్గ వంటి అందమైన ముక్కు, నక్షత్ర కాంతిని మించిన కాంతితో మెరుస్తున్న ముక్కు పుదక, కడిమి పూల గుత్తిచే అలంకరింపబడిన మనోహరమైన చెవులకు సూర్యచంద్రులే కర్ణాభరణములుగా కలిగి ఉన్నది. పద్మరాగమణి కెంపుతో చేయబడిన అద్దము కంటె అందమైన ఎర్రని చెక్కిళ్ళతో ప్రకాశించుచున్నది. రక్త పగడమును, దొందపండును మించిన అందమైన ఎర్రని పెదవులు, షోడశీమంత్రమునందలి పదునారు బీజాక్షరముల జతవంటి తెల్లని పలువరుస కలిగియున్నది.
శ్రీమాత సేవించిన కర్పూర తాంబూల సువాసనలు నలుదిక్కులకూ వెదజల్లుతుంటాయి. ఆమె పలుకులు సరస్వతీదేవి వీణానాదమును మించి ఉంటాయి. అమ్మ చుబుకముతో పోల్చదగిన వస్తువేదీ లేదు. కామేశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రముతో అమ్మ కంఠము శోభిల్లుతూంటుంది. ఆమె భుజములు బంగారు భుజకీర్తులతోనూ దండకడియములు, వంకీలతోనూ అందముగా అలంకరింపబడి ఉంటాయి. రత్నాలు పొదిగిన కంఠాభరణము ముత్యాల జాలరులు కలిగిన చింతాకు పతకము ధరించి ఉంటుంది. ఆమె నడుము సన్నగా ఉంటుంది. ఆమె కాలిగోళ్ళ కాంతి భక్తుల అఙ్ఞానాన్ని తొలగిస్తుంది. పద్మాలకంటే మృదువైన పాదాలు కలిగి ఉన్నది.
సంపూర్ణమైన అరుణవర్ణంతో ప్రకాశిస్తూ శివకామేశ్వరుని ఒడిలో ఆసీనురాలై ఉంటుంది
Manidweepa varnana Parayanam for
Removing Vastu Doshalu
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
|
No comments:
Post a Comment