దాసగణుకృత శ్రీ సాయి చరిత్ర | Dasagana Krutha Sri Sai Charitra | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

దాసగణుకృత శ్రీ సాయి చరిత్ర 
Dasagana Krutha Sri Sai Charitra


దాసగణు కథ

     ఒక ఇంటిని మనం కట్టుకున్నాక ఏయే వస్తువులు మనకి అవసరమవుతాయో గమనించుకుని ఎలా తెచ్చుకుని మనింట్లోనే ఉంచుకుంటామో, అలా సాయి కూడా తనతో పాటుగా ఏయే లక్షణాలున్నవారిని ఎవరెవరిని శాశ్వతంగా ఉంచుకోవాలో బాగా ఆలోచించుకున్నాడు. ఆయన దృష్టి అనన్యసామన్యం కదా! అలా ఆయన మనోభీష్టానికి అనుగుణంగా వచ్చి ఆయన దగ్గరే ఉండిపోయినవాళ్లే కాకా సాహెబ్, నానా సాహెబ్, సచ్చరిత్ర రాయాలనే దృక్పథానికి వచ్చిన అన్నాసాహెబ్‌ అనేవాళ్లు. ఈ ముగ్గురూ మంచి మిత్రులైపోయారు. వీరు కాక ఇంకా ఎందరో ఆయన దగ్గరికి రావడం భక్తులుగా మారిపోయి ఆయన సన్నిధిలోనే ఉండిపోవడం జరిగింది.అలాంటి ఉత్తమ భక్తుల కోవలోకి మరొకర్ని రప్పించుకోవాలని మనసులో భావించాడు సాయి. ఆ అనుకున్నది ‘దాసగణు’ అనే ఒక పోలీసు ఉద్యోగాన్ని చేస్తున్నవానిని గూర్చి సాయి తనలో అనుకోవడం తడవు – దాసగణుకి షిర్డీ రావాలని అనిపించింది. సాయి అతణ్ణి చూస్తూ.. ‘గణూ! ఆ పోలీసు ఉద్యోగాన్ని మాని ఈ మానవసేవకి అంకితం అయిపోకూడదూ? ప్రశాంతంగా జీవితాన్ని వెళ్లదీయచ్చుగా!’ అన్నాడు.దాసగణు ఆ మాటలకి కొద్దిగా అసంతృప్తి పడి – ‘స్వామీ! నేనిప్పుడు సాధారణ పోలీసుని. ఎందుకో పదవోన్నతిని పొంది సబ్‌ ఇన్‌స్పెక్టరుగా కొంతకాలంపాటు ఆ హోదాలో ఉండి ఆ మీదట వద్దామనుకుంటున్నా’ అన్నాడు. సాయి చిరునవ్వుతో ‘అలాగా! అలాగే కానీ!’ అన్నాడు.

చాలా తొందరకాలంలోనే దాసగణుకి పదవోన్నతి లభించింది. సబ్‌ ఇన్‌స్పెక్టరయ్యాక సాయి వద్దకొస్తానన్న ఆ మాట తనలో తిరుగాడుతూనే ఉంది. సాయి దర్శనానికొచ్చాడు. సాయి మాట్లాడుతూ.. ‘గణూ! ఇన్‌స్పెక్టరయ్యాక వచ్చేస్తానన్నావుగా!’ అన్నాడు. దాసగణు ఆ మాటకి సమాధానాన్ని చెప్పలేకపోయాడు. దానిక్కారణం ఆ ఉద్యోగంలో కొంతకాలం ఉండాలనే మోజు మాత్రమే. సాయి చిరునవ్వు నవ్వుకుంటూ తనలో అనుకున్నాడు. మంచి ఆధ్యాత్మిక భవిష్యత్తున్నవాడు కదా దాసగణు! ఈ లౌకిక ప్రవృత్తిలో ఎందుకిలా జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాడు? అని. ఇలా అనుకుని ‘సరే గణూ! ఎలా ఆ ఉద్యోగాన్ని నిర్వహిస్తావో చూద్దాం!’ అన్నాడు సాయి. ఆ మాటకర్థం అప్పుడు తెలియలేదు దాసగణుకి.కొన్నాళ్లయ్యాక పోలీసుస్టేషన్లో ఏదో చోరీసొత్తు దొంగలనుండి రాబట్టి తెచ్చినది కనిపించలేదు. దురుదృష్టవశాత్తూ ఆ సొమ్ముని దాసగణు తీసి ఉంటాడనే అభియోగం మోపబడింది. నిజానికి తాను నిర్దోషి. ఎన్ని విధాల తాను దోషిని కాదంటూ తగిన పత్రాలని సమర్పించినా దాసగణు మాత్రమే నేరగాడుగా లెక్కించబడ్డాడు. దాంతో దాసగణు ఉద్యోగానికి రాజీనామా చేస్తూ సాయి పలికిన పలుకుల్ని గుర్తు చేసుకుని – షిర్డీకి తన మకాంను మార్చేసాడు. 70 సంవత్సరాల వయసున్నప్పటికీ దృఢంగా ఉన్న తాను సాయిసేవలో పూర్తిగా తన జీవితాన్ని వెళ్లదీయాలని నిశ్చయించుకుని సాయి అనుమతిని కోరాడు. సాయి అనుగ్రహించాడు.

దాసగణుది మంచి శ్రావ్యమైన కంఠం. రాగాలజ్ఞానం కూడా ఉంది. సొంతంగా కీర్తనలని రచించి స్వరపరిచి పాడగల నైపుణ్యం ఉంది. తనకి కల్గిన అనుభవంతో, సాయిది భవిష్యత్‌ జ్ఞాన శక్తి కల తపశ్శక్తి అని గ్రహించి సాయి మీదే కీర్తనలని సొంతంగా రచించాడు. అంతతో ఊరుకోకుండా చుట్టుపక్కలనున్న గ్రామాల్లో హరికథల రూపంలో సాయి చరిత్రని శ్రావ్యంగా పాడుతూ అనేకుల్లో సాయి భక్తిని రగుల్కొల్పాడు. శ్రావ్యమైన కంఠం, కీర్తనల్లోని సాహిత్యం కారణంగా కేవలం మహారాష్ట్రలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా దాసగణు కీర్తనలని వినాలనే తపన ప్రారంభమయింది శ్రోతలైన భక్తులకి. దాంతో అనేక ప్రదేశాల్లో సాయి కీర్తనలని విరివిగా వినిపించాడు దాసగణు. ప్రతిఫలాపేక్ష ఏ మాత్రమూ లేకుండా ఇలా సాయి ప్రచారం విశేషంగా అయిన కారణంగా సాయి భక్తుల సంఖ్య మరింత అయిపోయింది.
నిజమైన ఆశ్చర్యకరమైన అంశమేమంటే దాసగణు నిజానికి సాయి భక్తుడు కాదు. తొట్టతొలుతదశలో అతను పండరిపురాధీశుడైన విఠ్ఠల భక్తుడు. ఆ సాహిత్యాన్ని బాగా చదివిన వాడూ అనేక అనుభవాలని పొందినవాడు కూడా. అయితే షిర్డీక్కూడ వస్తుండేవాడు కేవలం విఠ్ఠలునివద్దకే కాకుండా. అలాంటి దాసగణు సాయిని సమీపించి పాదాలని స్పృశించి నమస్కరించి ‘ప్రభూ! ఒక్కసారి పండరిపురానికి వెళ్లి విఠ్ఠలుని దర్శించి రావాలని అనిపిస్తోంది. నీ సన్నిధిని విడిచి వెళ్లడమా? అని మనసు వెనకడుగువేస్తోంది! కాదు పాండురంగణ్ణి. దర్శించాల్సిందేనని బుద్ధి వెంటపడుతోంది! నాకేమీ పాలుపోవడం లేదు’ అన్నాడు.

సాయి చిరునవ్వుతో దాసగణుని చూస్తూ ‘గణూ! పండరి వెళ్తేనే విఠ్ఠలుని దర్శనమవుతుందా? ఆయన అక్కడ మాత్రమే ఉన్నాడా? ఉంటూ ఉంటాడా? సరే! నీ అభీష్టానికి అనుగుణంగా పండరినాథుని దర్శనం కలిగేలా చేస్తాను. మరి నామగుప్తాహాన్ని (పండరి విఠ్ఠలదేవుని నామాన్ని క్రమం తప్పకుండా ఏడు రోజుల పాటు చేయడం) చేస్తావా?’ అన్నాడు. గురుదేవుని ఆజ్ఞ ప్రకారం తప్పక చేస్తానన్నాడు దాసగణు.తాను చెప్పిన ప్రకారం దాసగణు ఏడురోజుల పాటూ నియమనిష్ఠలతో పండరినాథుని దర్శనమవుతుందనే గట్టి ఎదురుచూపుతో సప్తాహాన్ని ముగించి సాయికి పాదాభివందనాన్ని చేసాడు. తలనెత్తి చూసే సరికి సాయి లేడు. పండరిపురనాథుడైన విఠ్ఠలుడే రుక్మిణీ సమేతంగా దర్శనమిస్తుండే సరికి దాసగణుకి కలిగిన ఆనందానికి శరీరం పట్టలేదు. ఏమిటీ వింత? నా దగ్గరికొచ్చి విఠ్ఠలుడు దర్శనమీయడమా? భగవంతుణ్ణి మన చెంతకి నామపారాయణం వల్ల రప్పించుకోగలమా? దానికి గురు అనుగ్రహం ఇంతగా ఉంటుందా? అనుకుంటూ ఆ విఠ్ఠలుని పాదాలని తన చేతులతో స్పృశించాడు. విఠ్ఠల పాండురంగడు విగ్రహరూపంలో లేడు. జీవించివున్న దైవరూపంలో సచేతనంగా కనిపించాడు. కనులనిండా ఆనందబాష్పాలు అలా కారిపోతుంటే... ‘సాయీ! సాయీ!’ అంటూ సాయిని మనఃపూర్వకంగా స్మరించాడు ఇంతటి ఆనందాన్ని కలిపించినందుకు. 

   అంతే! ఎదురుగా అయిదడుగుల శరీరంతో తానెప్పుడూ ధరించే పెద్దలాల్చీతో సాయి కనిపించాడు. దాసగణుకి నోట మాట రాలేదు. సాయి నిత్యం తన చెంత ఉన్న కారణంగా ఆయన గొప్పదనాన్ని లెక్కించలేకపోయానని సిగ్గుపడ్డాడు.కొంతకాలమయ్యాక దాసగణుకి గంగాయమునల్లో స్నానం చేసి రావాలనే బుద్ధి పుట్టింది. ఆ అభిప్రాయాన్నే సాయికి వెల్లడించాడు. సాయి మళ్లీ పూర్వంలాగానే నవ్వి – దాసగణూ! గంగాయమునలు ఇక్కడలేవా? ఇది ప్రయాగ కాదనుకుంటున్నావా? తప్పక స్నానాన్ని చేయిస్తాను’ అనగానే దాసగణు సాయిపాదాల చెంత తన శిరసునుంచి నమస్కరించాడు. అంతే ఒకపాదం నుండి గంగా మరోపాదం నుండి యమునా ధారలుగా రాసాగాయి. దాసగణుతో పాటు అందరికీ ఆశ్చర్యం ఆనందం కలిగాయి. ఇది సాధ్యమా? ఎలా వచ్చాయి ధారలుగా? (సశేషం..) 




ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment