(సూరి) వాల్మీకి రామాయణం
(Suri) Vaalmiki Ramayanam
Rs 108/-

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం
రామాయణం ఒక మహత్తరమైన
సాంఖ్య శాస్త్రం

     శతకోటి, అంటే 24 గాయత్రీ బీజాక్షరాలతో కూడిన 24,000 గ్రంథాల రామాయణంలోని ప్రతి అక్షరానికి మహా పాతకాలను నాశనం చేయగల శక్తిగలదని కొందరంటారు. కొందరేమో, శతకోటి రామాయణాన్ని వాల్మీకి సంగ్రహంగా చెప్పాడంటారు. ఇలాంటి మహిమ రామాయణంలో వుండడానికి కారణమేంటో ఆలోచించాలి. వాల్మీకి సూత్రాన్ననుసరించి, రామాయణం వేద స్వర సముద్ధృతంగా - సర్వశ్రుతులందున్నట్లుగా తెలుస్తోంది. వాల్మీకి రచించిన 24,000 శ్లోకాలలో, యజుర్వేదంలోని 1,29,290 పదాలే కాకుండా, రుగ్వేదం, సామవేదం, అధర్వ వేదాలలోని పదాలు కూడా అనులోమ - విలోమంగా కూర్చబడిందన్న రహస్యం తెలుసుకోవచ్చు. యజుర్వేదానికి ప్రాముఖ్యం ఇవ్వడానికి కారణం, శ్రీరాముడు యజుర్వేది కావడమే.

యజుర్వేద సంహితా ప్రమాణం ఆధారంగా రామాయణంలోని ఏడు కాండలంటే, సౌమ్యము, ప్రాజాపత్యము, వైశ్వదేవము, ఆగ్నేయము, ఆగ్నేయ బ్రాహ్మణము, సౌమ్య బ్రాహ్మణము, కామ్యకము. అదే విధంగా ప్రశ్నలు 44. అందులో మొదటి కాండలో 8, రెండులో 6, మూడులో 5, నాలుగులో 7, ఐదులో 7, ఆరులో 6, ఏడవ కాండలో 5 ప్రశ్నలున్నాయి. అనువాకాలు 651, పనసలు 2198, పదాలు 129290, అక్షరాలు 253868 వున్నాయి. ఈ విధంగా యజుర్వేదంలోని కాండల, ప్రశ్నల, అనువాకాల, పదాక్షరాల నిర్ణయం జరిగింది. శ్రీమద్రామాయణంలోని కాండలలో వేదాక్షరాలు ఎలా వున్నాయో పరిశీలించితే, బాలకాండ ప్రథమ సర్గ నుంచి ఐదో సర్గ వరకు రెండో శ్లోకం దాకా, నారదుడు ఉపదేశించిన విధానం రాసి, తర్వాతనే బ్రహ్మ ప్రత్యక్షం కావడంతో కథాభాగం వుంది. బాలకాండ 5 సర్గ 3వ శ్లోకం నుంచి, అయోధ్యకాండ 115వ సర్గ వరకు యజుర్వేదం, అయోధ్యకాండ 116వ సర్గ మొదలు, అరణ్యకాండ 74వ సర్గ వరకు ఋగ్వేదం, అరణ్యకాండ 75వ సర్గ మొదలు సుందరకాండ 48వ సర్గ వరకు సామవేదం. సుందరకాండ 49వ సర్గ మొదలు ఉత్తరకాండ 36వ సర్గ వరకు అథర్వ వేదం. ఉత్తరకాండ 37వ సర్గ మొదలు చివర వరకు ఉపనిషత్తు - అంటే శాంతి. ఈ విధంగా 647 సర్గలలో 23635 శ్లోకాలు, 776794 అక్షరాలున్నాయి. అక్షరాల సంఖ్యలో కొంచెం తేడా రావడానికి కారణం వేదాలలో వర్ణముల పదాలు విశేషంగా ఉండడం వల్ల ఇవి సరి చూసుకుంటే, వేద వర్ణాల లెక్కకు, రామాయణ వర్ణాల లెక్కకు సరిపోతాయి. రామాయణం వేదం కాబట్టే, నిరంతర అధ్యాయనపరుడైన వాల్మీకి, కొన్నిచోట్ల వేద పరిభాషా పదాలను, వేద సంజ్ఞలను ప్రయోగించాడు. ఈ సంకేతాలన్నింటినీ తెలుసుకోగలిగితే సందేహాలకు తావు లేకుండా వాల్మీకి రామాయణ సారాన్ని గ్రహించగలుగుతారు.

రామాయణం ఒక మహత్తరమైన సాంఖ్య శాస్త్రం. ‘కాదినవాది సూత్రాల’ ప్రకారం అక్షరాలకొచ్చే సంఖ్యలను బట్టి చూస్తే, రామాయణంలో కొన్ని చిత్రాలు కనిపిస్తాయి.

రా+మ= 2+5 = 7
అవతార సంఖ్య = 7
రామాయణ కాండ సంఖ్య = 7
యుద్ధం జరిగిన రోజుల సంఖ్య = 7
రామాయణ యుద్ధంలో ముఖ్యమైన పురుషుల సంఖ్య = 7
(రామ, లక్ష్మణ, హనుమ, విభీషణ, రావణ, కుంభకర్ణ, ఇంద్రజిత్తులు)

పారాయణం చేసేవారికి ముఖ్యంగా నియమితమైన సర్గల సంఖ్య 7. వ్యాహృతులు 7. ఇలా ఈ ఏడవ సంఖ్య మహిమ అద్భుతం. ‘శ్లోక శతై’ అని వాల్మీకి చెప్పినట్లు, బాలకాండం మొదటి సర్గ మొదటి శ్లోకం (తప స్స్వాధ్యాయ..)లోని అక్షరాలకొచ్చే సంఖ్యలను కూడితే 100 వస్తుంది. ఈ 100 సంఖ్య ప్రథమ సర్గలోని శ్లోకాల సంఖ్య. రామాయణంలోని సప్త సంఖ్యా నియమాన్ని గ్రహించిన వ్యాస భగవానులు నిజ రచిత గ్రంథానికి ‘జయ’ అని పేరు పెట్టాడు. ‘జయ’ అంటే 18. భారతంలోని పర్వాలు 18. యుద్ధం జరిగింది 18 రోజులు. రణ శూరులు 18 మంది. భగవద్గీతలో 18 అధ్యాయాలున్నాయి. ఇలా ఆలోచిస్తే, మహర్షులందరి మార్గాలు ఒక్కటేననిపిస్తుంది.

సీతారాముల వియోగం గురించి, కలిసి వుండడం గురించి అయోధ్యాకాండలో చెప్పబడింది. మిగిలిన కాండలలో కొంతకాలమన్నా వియోగం గురించి చెప్పబడింది. కాబట్టి, ‘సీత, రామ’ నామాల సంఖ్యలు కలిపితే (సీత = 67 + రామ = 52) 119 వస్తుంది. అయోధ్య కాండలో 119 సర్గలున్నాయి. ఇలాంటి చిత్రాలు ఎనె్నన్నో వాల్మీకి రామాయణంలో నిక్షేపం చేశాడు.

శ్రీరాముడు సామాన్య ధర్మాలన్నీ ఎలా అనుష్ఠించింది, కష్టకాలంలో ఎలా ప్రవర్తించింది, సుఖ కాలంలో ఎలా నడచుకుంది, ఎలాంటెలాంటి వారి మీద ఏ విధమైన అభిప్రాయంతో మెలిగేవాడనేదీ, వీటి కారణాలేంటి అన్న విషయాలన్నీ చర్చించాల్సినవే. రాముడి పైనా, ఆయన తమ్ములపైనా ఏక పత్నీవ్రతం విషయంలో కూడా విరుద్ధ్భాప్రాయాలను వెలిబుచ్చిన వారున్నారు. అసలా మాటకొస్తే ‘దుష్టులు వెలిచవి (జారత్వం) మరగిన భ్రష్టులు లేరప్పురమున రాష్టమ్రునందున్’ అని బాలకాండలో చెప్పినట్లు, దశరథుడు పాలించిన అయోధ్యలో ప్రతి మనుష్యుడు ఏక పత్నీవ్రతుడే. అలాంటప్పుడు రాముడు అనేక పత్నీకుడని ఎలా చెప్పారు? అలాంటి రాముడు వాల్మీకి వర్ణించిన శ్రీరాముడు మాత్రం కాడు. ఒక్క వాల్మీకే యథార్థ చరిత్రను వర్ణించాడు. మిగిలిన వారందరూ, రాముడి పరత్వాన్ని వర్ణించినవారే. ఇలానే వాలి వధ విషయంలో కూడా రాముడి గుణం దోషరహితమే. శ్రీరాముడు సంధ్యావందనం, దేవతార్చన, విగ్రహారాధన, వ్రతానుష్టానం లాంటి నిత్య కర్మలన్నీ శ్రద్ధగా చేసేవాడు.

‘రామాయణ గ్రంథమేమో చాలా గొప్పది. రాసిన కవేమో బ్రహ్మర్షి. ఇందులోని మర్మాలేమో మెండుగా వున్నాయి. రాసిందేమో సంస్కృత భాషలో. చదివిన కొద్దీ విశేషాలు కనిపిస్తాయి. నేనా కించిజ్ఞుడను - చంచల చిత్తుడను - శక్తిహీనుడను. అందుకే దోషాలు దండిగా వుంటాయి. పాఠకులు ఆంధ్ర వాల్మీకి రామాయణాన్ని దయతో చదివి నన్ను ధన్యుడిని చేయండి. భగవద్ధ్యానంలో ఆసక్తిగల భక్తులందరూ దీన్ని భగవంతుడికి నివేదించబడిన ప్రసాదంలా ఈ కృతిని భావించమని ప్రార్థన’ అని అంటూ ఆంధ్ర వాల్మీకి వాసుదాసుగారు చివరగా;

‘తప్పైనను నొప్పైనను, దెప్పుచునో మెచ్చుకొనుచో, దీనిన్ శ్రద్ధన్/ దప్పక సకలము జదివెడు, నప్పుణ్యాత్ముల కొనర్తు సాష్టాంగనతుల్’ అని ముగిస్తారు.-వనం జ్వాలా నరసింహారావు

(సూరి) వాల్మీకి రామాయణం |   (Suri) Vaalmiki Ramayanam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

అవనికే ఆధారం ధర్మం
   ధర్మో రక్షతి రక్షితః అన్న వాక్యం తరతరాలుగా సమాజంలో వినిపిస్తున్న మహామంత్రం. ధర్మ ప్రభావం ప్రతీ ఒక్కరి జీవితంలో అపూర్వ భాగమై ఉన్నతంగా ఎదిగేలా చేస్తుంది. ధర్మమే భూమిని ధరిస్తుంది. ధర్మమే ప్రజల్ని పాలిస్తుంది. ధర్మమే జీవన ధర్మమై మార్గనిర్దేశనం చేస్తుంది. ధర్మాన్ని కాదని మనం జీవితంలో ఒక్క అడుగైనా ముందుకేయలేము. ధర్మానికి అతీతమైంది ఈ ప్రపంచంలోనే లేదు. కానీ, ధర్మానికి పోతే అన్యాయం అయిపోతామనీ, సమయాన్ని బట్టి కొన్నిసార్లు మనకు తోచిన విధంగానో, కాస్త అడ్డదారిలోనో, ఏమరపాటులోనో, మనగురించి ఆలోచించేవారి కోసమో ధర్మాన్ని పక్కన పెట్టాలనీ చెబుతుంటారు కొందరు. వినే వాళ్ళుంటే సమాజం ఎన్నెన్నో చెబుతుంటుంది. మనం నమ్మే సిద్ధాంతం ధర్మబీజమైనప్పుడు ఎటువంటి పరిస్థితులెదురైనా ధర్మాన్ని విడిచిపెట్టరాదనీ, అసలు ధరణికి ఆధారమే ధర్మమనీ చెబుతుందీ గాథ.

శ్రీరాముడు వనవాసం చేస్తుండగా భరతుడు తమ ముగ్గురు తల్లులనూ తీసుకొని సీతారామ లక్ష్మణులను చేరాడు. దశరథుని మరణవార్తను తెలియజేసి, కైకేయి వరాలు ఉపసంహరించుకుందనీ, రాముడు తిరిగి అయోధ్య రాజ్యపాలన చేపట్టాలనీ భరతుడు మంకుపట్టు పట్టినా, శ్రీరామచంద్రుడు ఇచ్చిన మాట తప్పనని భరతునికి నచ్చచెబుతున్న సందర్భంలో జాబాలి కలుగజేసుకొని ధర్మ విరుద్ధంగా మాట్లాడుతూ శ్రీరామచంద్రా! పెద్దవాడినైన నా మాటను సావధానంగా విను. రాజు పుట్టినప్పుడు ఎవరూ తోడురారు. పోయేటప్పుడూ అంతే. ఎన్నో ప్రదేశాల్లో నివసిస్తాం. ఆ తర్వాత వాటిని వదిలేస్తాం. అంతవరకే సంబంధం. తల్లిదండ్రులూ, భార్యాపిల్లలూ, కలిమిలేములూ సంబంధం. ఉన్నంత వరకే మనతో కలిసి ప్రయాణిస్తాయి. సంబంధం వీడిపోయాక మాటలతో, బాసలలో ఏ సంబంధమూ కానరాదు. ధర్మం కోసం పోయి రాజభోగాలు వదులుకోవడం సమంజసం కాదు. ఏ ధర్మం ఆచరించినా, ఎన్ని సత్యవ్రతాలు చేసినా మనిషి చివరకు కాంక్షించేది స్వర్గసుఖాలే! తండ్రే లేనప్పుడు ఆయన ఆజ్ఞతో పనేంటి? ఎదుటఉన్న రాజ్యాన్ని పాలించు. భోగాలను అనుభవించు. అందరినీ సంతోషపెట్టవయ్యా రామయ్యా! అని విన్నవిస్తాడు.

జాబాలి మాటలన్నింటినీ విన్న శ్రీరాముడు చిరుమందహాసంతో జాబాలీ! నువ్వు చెప్పేది అకార్యం. నీవి ప్రియంగా వినిపించే విషవాక్యాలు. మధురమైన మామిడి పండ్లలా కనిపించే విషపూరిత పండ్లు కూడా లోకంలో ఉన్నాయి. రెండూ ఒకేలా కనిపించినా ఎంతో వ్యత్యాసం ఉంది. నీ మాటలు కూడా మంచిగానే వినిపిస్తున్నా అధర్మాన్ని ధ్వనిస్తున్నాయని అంటాడు.

లోకంలో ధర్మం, న్యాయం శాశ్వతం. జీవులు పుడతారు పోతారు. కాలగర్భంలో జన్మించిన కోటానుకోట్ల ప్రాణులలెక్క బ్రహ్మకూ, మరణించిన లెక్క యమునికి తప్ప మరెవ్వరికీ తెలియదు. కాబట్టి ధర్మవేషం ధరించి అధర్మం చేయలేను. శాస్ర్తాల్లో ఉన్నాయనీ, లోకరీతి మారుతుందనీ ఏవేవో మాటలు ఎంత వల్లించినా అసత్యం సత్యమవదు. జాబాలీ! ప్రపంచమంతా నువ్వు చెప్పినట్లే ప్రవర్తిస్తే అనుబంధాలు, గౌరవ మర్యాదలు, కట్టుబాట్లు అనే నియమాలకు విలువలుండవు. బలవంతులు బలహీనుల్ని వశపరుచుకొని బాధిస్తారు. ప్రజల మాన, ప్రాణాలకు భద్రత ఉండదు. లోకంలో సుఖదుఃఖాలు అందరికీ ఒకలా ఉండవు. రోజులు మారుతూ ఉంటాయి. వారు వీరు అవుతారు. అప్పుడే కష్టసుఖాల పరమార్థం తెలుస్తుంది. మానవజన్మకు సార్థకత లభిస్తుంది. అధర్మం అనునయించే అయోగ్యం, అయుక్తం, అనుచితం రాముడు ఎన్నడూ చేయడు. చేయలేడు. భువిపై ధర్మం పంచన బతికిన వారే మహాత్ములై చరిత్రలో నిలిచిపోయారు. ధర్మం అంతగొప్పది. కీర్తి, సంతృప్తి ధర్మాత్ముడినే చేరతాయి. ధర్మమే మనిషికి పరమగమ్యం. అదే మానవ జీవనపథ నిర్దేశం అని చెబుతాడు శ్రీరాముడు జాబాలితో. రాముని మాటలు జాబాలి ఆలోచనలకు మాత్రమే కాదు, యావత్ప్రపంచాన్నీ మేల్కొల్పుతాయి.జాబాలీ, రామచంద్రుల సంవాదం ధర్మాధర్మాల విశ్లేషణ మాత్రమే కాదు. అంతకంతకూ కుంచించుకు పోతున్న మనిషి ఆలోచనను తట్టిలేపే విశ్వప్రయత్నం. ధర్మమే అన్నింటికీ మూలం, అవనికి ఆధారం.

మానవజన్మకు సార్థకత లభిస్తుంది. అధర్మం అనునయించే అయోగ్యం, అయుక్తం, అనుచితం రాముడు ఎన్నడూ చేయడు. చేయలేడు. భువిపై ధర్మం పంచన బతికిన వారే మహాత్ములై చరిత్రలో నిలిచిపోయారు. ధర్మం అంతగొప్పది. కీర్తి, సంతృప్తి ధర్మాత్ముడినే చేరతాయి. ధర్మమే మనిషికి పరమగమ్యం. అదే మానవ జీవనపథ నిర్దేశం అని చెబుతాడు శ్రీరాముడు జాబాలితో.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment