హనుమద్ వ్రతం
Hanumad Vratham
Rs.36/-
హనుమద్వ్రతం

లోకంలో కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా కొన్ని పాత్రలు దేవతామూర్తులుగా మనముందు నిలుస్తాయి. ప్రతి దేవత పాత్ర వెనక లోకం అందుకోదగిన గొప్ప సందేశం ఉంటుంది. అటువంటి దేవతామూర్తుల్లో సర్వశక్తులకు సంకేతం హనుమంతుడు. భౌతిక రూపంలో వానరుడైనా వృత్తి, ప్రవృత్తుల్లో నరులవలె ప్రవర్తించి శక్తియుక్తుల్లో దైవత్వం కనబరచాడు. తేజస్సు, ధైర్యం, సామర్థ్యం, వినయం, నీతి, చాతుర్యం, పౌరుషం, పరాక్రమం, బుద్ధి హనుమంతుడిలోని విశిష్ట గుణాలుగా రామాయణంలో దర్శించగలుగుతాం. హనుమ- గురువు, దైవం, జ్ఞాని. రుద్రాంశ సంభూతుడిగా శైవులకు, రామభక్తుడిగా వైష్ణవులకు ఆరాధ్యుడు.
హనుమత్తత్వం మనసుకు ప్రతీక. మనసు నిత్యం చలిస్తుంది. ఈ చాంచల్యాన్ని అరికట్టడానికి సాధన అవసరం. పరమార్థ సాధనకు, శ్రీరామ చరణారవింద ప్రాప్తికి వానరం వంటి మనసూ ప్రయత్నం చేయవచ్చునని ఆంతర్యం కావచ్చు. అచంచల మనఃస్థితికి ప్రతినిధి మారుతి.
హనుమ గొప్ప కార్యసాధకుడు. ఆయనది దాస్యభక్తి. స్మరించగానే సాంత్వన భావం కలిగించి, ధైర్యం చేకూర్చి కార్యోన్ముఖుల్ని చేయగలడని విశ్వాసం. స్వామిని పూజించడంవల్ల సకల భయాలూ నశిస్తాయని గ్రహ, పిశాచ, పీడలు దరిచేరవని మానసిక వ్యాధులు తొలగిపోతాయని అనాదిగా భక్తులు విశ్వసిస్తున్నారు. అటువంటి ఆంజనేయ మూర్తిని ఆరాధిస్తూ చేసే ‘హనుమద్వ్రతం’ మార్గశిర మాసంలో శుక్లపక్ష త్రయోదశినాడు ఆచరించాలని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి.
పాండవులు వనవాసంలో ఉండగా వ్యాసమహర్షి వారిని చూసేందుకు వెళతాడు. ధర్మరాజు తమకష్టాలు తొలగిపోయే మార్గం ఉపదేశం చేయమని వ్యాసుణ్ని ప్రార్థిస్తాడు. అప్పుడాయన ఈ వ్రతాన్ని ఆచరింపజేసినట్లు పురాణ కథనం.
పూజా మందిరంలో బియ్యపు పిండిలో అష్టదళ పద్మాన్ని చిత్రించి దానిపై బియ్యం పోసి కలశం ఏర్పాటు చేసి దానిపై కుంకుమ, గంధం, సిందూరం, పుష్పాలతో అలంకరిస్తారు. కలశం ముందు స్వామివారి చిన్నవిగ్రహాన్ని గాని, చిత్రపటంగాని ఏర్పాటు చేసుకొని కలశంలోనికి స్వామివారిని ఆవాహనచేసి వినాయక పూజ, పిమ్మట స్వామివారి పూజ ఆచరిస్తారు. షోడశోపచారాలు, అష్టోత్తర శతనామాలతో పూజిస్తారు. గోధుమలతో చేసిన భక్ష్యాలను .నైవేద్యంగా సమర్పిస్తారు. 13 పోగుల తోరాన్ని స్వామివారి వద్ద ఉంచి పూజించి ధరిస్తారు. వ్రత కథాశ్రవణ చేస్తారు. రాత్రి ఉపవాసం ఉంటారు. తోరాన్ని మరుసటి ఏడాది వరకు భద్రంగా ఉంచుకుంటారు. ఏడాది తరవాత కొత్త తోరం ధరిస్తారు. ఈ విధంగా 13 సంవత్సరాలు వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చెయ్యాలి. కనీసం ఒక్కసారైనా ఈ వ్రతం చేసుకుంటే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వ్రతాచరణం వల్ల సమస్యలూ కష్టాలు తొలగిపోయి సుఖశాంతులు, సౌభాగ్యం, జ్ఞానం లభిస్తాయని పండితులు చెబుతారు.
వ్యక్తిత్వ వికాసంలో కార్యసాధనలో పరిణత బుద్ధితో హనుమ తన విలక్షణ వ్యక్తిత్వంతో నేటి యువతకు ఆదర్శప్రాయుడు. హనుమత్ తత్వ స్ఫూర్తికి ఈ వ్రతాచరణం దోహదకారి అవుతుంది.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
------------------------
శ్రీమదాంజనేయ కల్యాణము
శ్రీ ఆంజనేయ స్వామి అజన్మ బ్రహ్మచారి.. యజ్ఞోపవీతము ధరించే పుట్టినవాడు. ఘోటక బ్రహ్మచారి అయినా వివాహము చేసుకున్నాడు.. వివాహము చేసుకున్నా కూడా బ్రహ్మచారిగానే మిగిలిపోయినాడు.. లోక కల్యాణము కోసము హనుమంతులవారు మొదట తన కల్యాణము చేసుకోవలసి వచ్చింది.. పరాశర సంహితలో ఆసక్తికరమైన ఈ ఉదంతము ఉంది.
ఒకప్పుడు సూర్యదేవుడు , విశ్వకర్మ కూతురైన సంజ్ఞాదేవిని పెళ్ళాడతాడు. అయితే , సంజ్ఞా దేవికి సూర్యుని తాపమును తట్టుకొను శక్తి లేదు..ఖిన్నురాలై , తన తల్లికి తన కష్టాన్ని చెప్పుకుంటుంది.. కూతురి సమస్యను అర్థము చేసుకున్నదై, ఆమె తల్లి , విశ్వకర్మకు సంగతి విశదీకరిస్తుంది. విశ్వకర్మ , సూర్యుడి ప్రకాశమును కొంత తీసివేస్తాడు. సూర్యునినుండీ బయట పడ్డ ఆ ప్రకాశము , ఒక సుందరమైన కన్యగా మారుతుంది. ఆమె రూప లావణ్యములను చూసి దేవతలే భ్రాంతి చెందుతారు. సంగతేమిటో తెలుసుకోవాలని ఇంద్రుడు , బ్రహ్మ దేవుని వద్దకు వెళ్ళి , " ఆ కన్య ఎవరు ? " అని అడుగుతాడు. ఇంద్రుడి ఉద్దేశము కనిపెట్టిన బ్రహ్మ ,ఆమెకు కాగల పతి శివాంశ సంభూతుడైన హనుమంతుడు తప్ప వేరొకరు కారు అని చెబుతాడు.
బాల హనుమంతుడు తల్లి అంజనా దేవి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి , ఆమె అనుజ్ఞ మేరకు సూర్యుని దగ్గర విద్యాభ్యాసము చేస్తాడు. శిక్షణ పూర్తికాగానే గురువు వద్దకు వచ్చి వినమ్రుడై , " గురుదేవా , నా శిక్షణ పూర్తయిందని తమరి అనుజ్ఞ అయినది , నాకు ఇక వెళ్ళుటకు అనుమతినీయండి , మీకు గురు దక్షిణగా ఏమివ్వవలెనో చెప్పండి " అంటాడు. " శివాంశతో పుట్టినవాడవు , ఆంజనేయా , నిన్ను నేనేమని కీర్తించను ? సాగర మథనములో పుట్టిన గరళాన్ని జగద్రక్షణ కోసము మింగిన సాక్షాత్తూ ఆశివుడవే నువ్వు. నువ్వు వాయు దేవుడి పుత్రుడవు కూడా.. అగ్నికి పుత్ర సమానుడవు. మనము గురుశిష్యులమన్నది కేవలము ఔపచారికము మాత్రమే.. అయిననూ , అడిగినావు గనక , విను... విశ్వకర్మ , నాలోని ప్రకాశమును కొంత వేరుపరచినాడు. ఆ నాయొక్క ప్రభ ఇప్పుడు నా కూతురు రూపములో ఉన్నది. నా కాంతి నుండీ పుట్టిన నా కూతురు సువర్చలా దేవిని నీకిచ్చి వివాహము చేయవలెననునది నా కోరిక. ఇదే నువ్వు నాకు ఇవ్వవలసిన గురు దక్షిణ " అంటాడు సూర్యుడు. హనుమంతుడు వినీతుడై సూర్యునికి తలవంచి , రెండు చేతులూ జోడించి నమస్కరించి , " దేవా , నేను బ్రహ్మచర్యమును పాలించవలెనని తీర్మానించుకున్నాను.. అది మీకు తెలిసినదే కదా .. నా జీవన లక్ష్యము అదే. నేనీ వివాహము ఎలా చేసుకోగలను ? " అని అడుగుతాడు.
సూర్యుడు ఉత్తరమిస్తాడు , " సువర్చల దైవాంశ సంభూతురాలు. నేను నీకొక వరమునిస్తాను. నువ్వు ఆమెను పెళ్ళాడిననూ , ప్రాజాపత్య బ్రహ్మచారిగనే మిగిలిపోతావు. నీ ఈ వివాహము కేవలము జగత్కల్యాణము కోసమే తప్ప , నీ వ్రత భంగానికి కాదు. నువ్వు యజ్ఞోపవీతము ధరించియే పుట్టినవాడవు కాబట్టి పుట్టిన క్షణమునుండే నువ్వు బ్రహ్మచారివి. భవిష్యత్తులో , కలియుగానంతరము , ప్రళయానంతరము తరువాత తిరిగి జరగబోయే సృష్టికి నువ్వే బ్రహ్మవవుతావు. నువ్వు బ్రహ్మదేవుని పదవిని అలంకరించిన తరువాత , సువర్చలాదేవి వీణాపాణియైన ఆ వాణి స్థానములో ఉంటుంది.
సందేహ నివృత్తి అయిన హనుమంతుడు , సూర్యుని ఆజ్ఞమేరకు సువర్చలా దేవిని వివాహమాడుతాడు. హనుమంతుని కల్యాణమైన దినము , జ్యేష్ఠ శుద్ధ దశమి.. హనుమ పూజలో అగ్ని సూక్తముతోను , [ పంచామృతములతోను కూడా ] హనుమంతుడికి అభిషేకము [ విగ్రహ శోధన ] చేస్తారు. సువర్చలా పూజనుకూడా తమలపాకులపై సువర్ణ సహిత పుష్పాక్షతలతో చేస్తారు. భక్తులందరూ ఈ హనుమ కల్యాణ గాథను చదివి తరింతురు గాక || శుభమస్తు ||
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
|
No comments:
Post a Comment