పార్వతి కళ్యాణం  Parvati Kalyanam |  GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu



Rs 25/-


శివపార్వతుల వివాహం జగత్ కల్యాణమే

పరమేశ్వరుని పతిగా పొందిన సతి అన్యోన్యానురాగాలతో పరమశివుణ్ణి సేవించసాగింది. సతి తండ్రి యైన దక్షుడు ఒకానొక కాలంలో అహంకారానికి వశమైనాడు. శివదూషణ చేయడానికి వశుడయ్యాడు. ఆ క్రమంలోనే తాను తలపెట్టిన యజ్ఞానికి శివుని పిలవకూడదని నిశ్చయించుకున్నాడు. తన పుత్రిక పై కూడా మమకారాన్ని వదిలివేసుకొని శివునికి ఆహ్వానం అందించకుండానే యజ్ఞాన్ని తలపెట్టాడు. సర్వలోకాలు దక్షయజ్ఞం గురించి మాట్లాడుకొంటున్నా తమకు ఆహ్వానం పలుకరేమని సతి వాపోయింది. చివరకు యజ్ఞసమయం దాకా చూచి తన తండ్రినే గదా పిలువకపోయినా ఫర్వాలేదు వెళ్లి ఆ యజ్ఞసంబరాన్ని చూచి వస్తానని తన పతితో చెప్పింది. పిలవని పేరంటం తగదు అని ఆదిభిక్షువు చెప్పాడు. కాని పతి మాట వినక సతి దక్షయజ్ఞానికి వెళ్లింది.

అక్కడ తన తండ్రి చేసే శివదూషణను వినలేకపోయింది. శివనింద విన్న ఈ శరీరం తనకు అక్కర్లేదని ఆ యజ్ఞకుండంలోనే సతి శరీరత్యాగం చేసింది. ఈ సంగతి విన్న శివుడు రుద్రుడయ్యాడు. ప్రళయాగ్నిలాగా మారాడు. శివగణం తరలివెళ్లింది. దక్షుని తల తెగింది. అతని అహంకారం నశించింది. చివరకు దక్షుడు శివ శరణం చేశాడు. అపార కృపావత్సలుడైన శివుని అనుగ్రహంతో మేకతలను దక్షునికి అమర్చారు. శరీర త్యాగం చేసిన సతిని భుజాన వేసుకొని ప్రళయకాల రుద్రుడైన పరమశివుడు శివతాండవం చేశాడు. తపోవనాలకు వెళ్లిపోయాడు. ధ్యానమగ్నుడయ్యాడు.

సతి మేనకా హిమవంతుల ఇంట ముద్దులోలికే చిన్నారిగా మారింది. ఉమ నామంతో వ్యవహరించబడింది. చిన్ననాటినుంచే శివధ్యానంతో తన్మయత్వం చెందేది. యుక్తవయస్సురాగానే తాను పరమేశ్వరుని ఇల్లాలు కావాలని తపస్సు చేయడానికై తల్లిదండ్రులనుంచి అనుమతి కోరింది. ఆ తల్లి అపర్ణయై పంచాగ్నుల మధ్య తీక్షణమైన తపస్సు చేసింది.
ఈ సంగతి తెలిసిన శివుడు మాయా బ్రహ్మచారి వేషం వేసుకొని అక్కడకు వచ్చాడు. తన చెలులతో సాయంతో తపస్సు చేసుకొంటున్న గిరిజను చూచాడు. విశ్రాంతి పేరిట ఉమాశ్రమంలో అడుగుపెట్టాడు. తన చెలులతో ఆ మాయాబ్రహ్మచారికి మేనక సుత ఆతిధ్యమిచ్చింది. కఠినమైన తపస్సుకు కారణమేమిటని మాటలను కలిపాడు మాయావటువు. చెలికత్తెలే ఆ బ్రహ్మచారికి ఉమ తరఫున బదులిచ్చారు. తాను బ్రహ్మచారినే కనుక వివాహేచ్ఛతో తపస్సుకు పూనుకొని ఉంటే ఉమాదేవికి అంగీకారమైతే వివాహానికి అడ్డు ఉండబోదని చెప్పాడు.

కేవలం పరమశివుని కోరి తపస్సుకు ఉపక్రమించిదని తెలుసుకున్న బ్రహ్మచారి ఆ శివుని దగ్గర ఏముంది బూడిద తప్ప. ఈ దేవిని చూస్తేనేమో పట్టుపీతాంబరాలుకట్టుకునే సుకుమారిగా ఉంది. పైగా పర్వతరాజ పుత్రిక పార్వతి ఎన్నో ఆభరణాలను దిగవేసుకొనే నైపుణ్యానికి తగిన అవయవ సౌందర్యం కలది. కాని. అక్కడ శివుని దగ్గర బుసలు కొట్టే పాములు, గాడ్రించే పులితోలు, పైగా శివుని చేతిలో త్రిశూలం అన్నీ భయంకరాలే పైగా శ్మశాన నివాసి ఎద్దు నెక్కి తిరుగువాడు ఇటువంటివాడిని కోరి మరీ తపస్సు చేయడం అవివేకమైన పనికదా. దానికి బదులుగా తన్ను వివాహమాడితే ఎంతో సుందరంగా వుంటుందని చెప్పే మాయాబ్రహ్మచారిని ఉరిమి చూస్తూ తన చెలులతో బయటకు పంపించివేయమంది ఆ పార్వతి.

శివునిపై గాఢమైన అనురాగాన్ని పెంచుకుంటున్న గౌరిని చూచి మందహాసం చేస్తూ తన అసలు స్వరూపాన్ని చూపాడు పరమశివుడు. అమితానంద భరితయైన పార్వతి తన తండ్రియైన హిమవంతుని అనుమతి తీసుకొని తన్ను వివాహం చేసుకోవడానికి మార్గం సులువు చేసుకోమని చెప్పే హితబోధను విన్న పరమశివుడు హిమవంతుని దగ్గరకు కబురు పంపాలనుకొన్నాడు.

విషయం తెలుసుకున్న దేవగణమంతా తరలివచ్చింది. హిమవంతుని దగ్గరకు వెళ్లి పెళ్లిమాటలు మాట్లాడారు. పార్వతీ పరమేశ్వరుల వివాహానికి శ్రీకారం చుట్టారు. బ్రహ్మాది దేవతలంతాకలసి పార్వతీ పరమేశ్వరులకు వివాహాన్ని చేశారు. సకలలోకాలు ఆనందించాయి. తారకాసుర భంజనం జరిగి తీరుతుందని శివకుమారుడు ఉద్భవిస్తాడని అంతా శుభాలు జరుగుతాయని సర్వులూ శుభాలు పలికారు. - చోడిశెట్టి


ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment